‘బ్యాట్‌’ దాడిని తిప్పికొట్టిన సైన్యం | Border Action Team attack foiled along loc | Sakshi
Sakshi News home page

‘బ్యాట్‌’ దాడిని తిప్పికొట్టిన సైన్యం

Jan 1 2019 5:00 AM | Updated on Jan 1 2019 5:00 AM

Border Action Team attack foiled along loc - Sakshi

శ్రీనగర్‌: సరిహద్దుల్లోని భారత్‌ సైనిక పోస్టుపై పాకిస్తాన్‌ ప్రత్యేక దళమైన బోర్డర్‌ యాక్షన్‌ టీం (బ్యాట్‌’) చేసిన దొంగచాటు దాడి యత్నాన్ని భారత్‌ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్‌ సైనికులు హతమయ్యారు. మిగతా వారు తిరిగి పాక్‌భూభాగంలోకి పారిపోయారు. ఈ ఘటనకశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లోని భారత్‌–పాక్‌ నియంత్రణ రేఖ వెంబడి శనివారం అర్ధరాత్రి జరిగింది. ‘సరిహద్దు దాటి లోపలికి వచ్చేందుకు ‘బ్యాట్‌’ సభ్యులు చేసిన యత్నాన్ని మన బలగాలు భగ్నం చేశాయి.

పాక్‌ బలగాలు మోర్టార్లు, రాకెట్‌ లాంచర్లతో కాల్పులు జరుపుతూ రక్షణగా నిలవగా అడవి నుంచి భారత్‌ భూభాగంలోకి చొరబడేందుకు ‘బ్యాట్‌’ దళం ప్రయత్నించింది. వెంటనే భారత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పాక్‌ సైనికులుగా భావిస్తున్న ఇద్దరు చనిపోగా, మిగతా వారు పారిపోయారు’ అని సైనిక ఉన్నతాధికారి చెప్పారు. ‘ వారి వద్ద శక్తివంతమైన ఐఈడీ పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలున్నాయి. దీనిని బట్టి భారత్‌ పోస్టుపై భారీ దాడికి ప్రణాళిక వేసుకున్నారని అర్థమవుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ ‘బ్యాట్‌’?
పాక్‌ సైన్యంలోని స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ) నిర్మించిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌)లో దాదాపు 8 మంది సభ్యులుంటారు. ఈ గ్రూపుల్లో సైనిక కమాండోలు, ఉగ్రవాదులు ఉంటారు. వీరు సరిహద్దుల్లోని భారత సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతుంటారు. పాక్‌ ఆర్మీ కమాండోలు కూడా బ్యాట్‌లో ఉన్నప్పటికీ భారత సైన్యానికి పట్టుబడినప్పుడు మాత్రం అక్కడి ప్రభుత్వం తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement