ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రవేశపెట్టిన పథకాల వెనుక మోదీ ప్రభుత్వం ఉద్దేశం ఏంటో ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా చేసేందుకు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి, బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తర్ అబ్బాస్ నఖ్వీ మీడియాకు వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశంపై చర్చించినట్టు నఖ్వీ చెప్పారు.
ఇటీవల ప్రవేశపెట్టిన 2016-17 కేంద్ర బడ్జెట్ను ప్రశంసిస్తూ.. ప్రజలకు ప్రభుత్వ పథకాల ఉద్దేశం గురించి తెలియజేయడం ముఖ్యమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ను వివరణాత్మకంగా తెలియజేసేందుకు అవసరమైతే ప్రజల్లోకి వెళ్లైన సరే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు.