11 నుంచి బీజేపీ కార్యవర్గ సమావేశాలు

The BJP is preparing for the 2019 Lok Sabha elections - Sakshi

ఢిల్లీ వేదికగా ఎన్నిక ప్రచారం  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇందులోభాగంగా వచ్చేఏడాది జనవరి 11 నుంచి రెండ్రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు జరగనున్నాయి. ఈ వేదికపై నుంచే 2019 ఎన్నికలకు బీజేపీ కార్యాచరణ రూపొందించనుంది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నేతృత్వంలో 29 రాష్ట్రాలకు చెందిన ఆఫీస్‌ బేరర్ల సమావేశం గురువారం జరిగింది. అనంతరం బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ జనవరిలో 11–12 తేదీల్లో పార్టీ జాతీయ కార్యనిర్వాహక మండలి సమావేశాలను నిర్వహించనున్నాం.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను పటిష్టం చేసేందుకు వేర్వేరు వర్గాలను కలుసుకుంటాం. యువతకు బీజేపీ విధానాలు, సిద్ధాంతాలను వివరించేందుకు ఢిల్లీలో ఈ నెల 15 నుంచి రెండ్రోజుల పాటు ‘యువ మోర్చా’ సమావేశం నిర్వహిస్తాం. మహిళల కోసం అహ్మదాబాద్‌లో డిసెంబర్‌ 21–22 తేదీల్లో మహిళా మోర్చా సదస్సు జరుగుతుంది. షెడ్యూల్డ్‌ కులాల కోసం నాగ్‌పూర్‌లో 2019, జనవరి 19 నుంచి రెండ్రోజుల పాటు ఎస్సీ మోర్చాను నిర్వహిస్తాం. మైనారిటీల కోసం ఢిల్లీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జాతీయస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేస్తాం’ అని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top