కుదరని సయోధ్య | BJP, Congress spar bitterly ahead of all-party meeting | Sakshi
Sakshi News home page

కుదరని సయోధ్య

Aug 4 2015 3:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

కుదరని సయోధ్య - Sakshi

కుదరని సయోధ్య

15 రోజులుగా పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఫలితం లేకుండా  ముగిసిన అఖిలపక్షం
* రాజీనామా డిమాండ్‌పై వెనక్కి తగ్గని కాంగ్రెస్
* రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ:  15 రోజులుగా పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ సీఎంలు వసుంధరా రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామాల డిమాండ్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. అయితే రాజీనామా డిమాండ్‌కు ప్రభుత్వం ససేమిరా అనడంతో సోమవారం జరిగిన అఖిలపక్ష భేటీ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.

కాంగ్రెస్ డిమాండ్‌కు జేడీయూ, లెఫ్ట్ పూర్తి మద్దతు తెలుపగా.. తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ తదితర ప్రాంతీయ పార్టీలు మాత్రం పార్లమెంట్‌లో ప్రతిష్టంభనపై రెండు జాతీయ పార్టీల తీరును తప్పుపట్టాయి. భేటీ అనంతరం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ సమావేశం వల్ల ఫలితం శూన్యం. మేము డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంటును అడ్డుకునే సంస్కృతిని ప్రారంభించింది బీజేపీయే అని ఆరోపించారు.

ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనా లేకుండా వచ్చిందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు.  కాంగ్రెస్ విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ఖండించారు. ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం ఎప్పుడు ఒక అడుగు ముందుకే వేసిందని చెప్పారు. జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ బిల్లులను సెలక్ట్ కమిటీకి అప్పగించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రధాని కూడా వీటిపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే ఎన్‌డీఏ మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని, వారు ఎటువంటి అక్రమాలకు.. అనైతిక చర్యలకు పాల్పడలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement