జైలర్‌ గదిలోనే ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ సంసారం! | Bihar jail staff arrange secret date for gangster and his undertrial wife | Sakshi
Sakshi News home page

జైలర్‌ గదిలోనే ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ సంసారం!

Jan 14 2016 11:51 AM | Updated on Sep 3 2017 3:41 PM

జైలర్‌ గదిలోనే ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ సంసారం!

జైలర్‌ గదిలోనే ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ సంసారం!

ఒకప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నా ఖైదీలకు యథేచ్ఛగా సెల్‌ఫోన్లు, మాదక ద్రవ్యాలు, విలాస వస్తువులు అందేవి.

పట్నా: ఒకప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నా ఖైదీలకు యథేచ్ఛగా సెల్‌ఫోన్లు, మాదక ద్రవ్యాలు, విలాస వస్తువులు అందేవి. ఖైదీలతో జైలు సిబ్బంది కుమ్మక్కై.. ఇలాంటి చిన్న చిన్న సేవలు అందించడం కారాగారాల్లో నిత్యకృత్యంగా జరుగుతున్నా.. ఈ విషయంలో బిహార్ జైలు సిబ్బంది మరో అడుగు ముందుకువేశారు. జైలు గదిలోనే ఓ గ్యాంగ్‌స్టర్‌, అతని భార్య అయిన అండర్ ట్రయల్‌ ఖైదీ సంసారం చేసుకోవడానికి వీలు కల్పించినట్టు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బిహార్‌లోని షివోహర్‌ జైలులో అండర్ ట్రయల్‌ ఖైదీ పూజకుమారి గర్భం దాల్చిన వ్యవహారంపై దర్యాప్తు జరుపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న తన భర్త, గ్యాంగ్‌స్టర్‌ ముఖేశ్‌ పాఠక్‌ను ఆమె తరచూ జైలులోని అసిస్టెంట్ జైలర్‌ కార్యాలయంలో కలిసేదని, ఇద్దరు కాపురం చేసిన ఫలితంగా ఆమె గర్భం దాల్చిందని వెలుగుచూడటం విస్మయపరుస్తోంది. గత ఏడాది ఈ భార్యాభర్తలు ఇద్దరూ వేర్వురు కేసుల్లో షివోహర్‌ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. ఆ సమయంలో వీరు వేరువేరు గదుల్లో దూరంగా ఉన్నా.. జైలు సిబ్బందికి తాయిలాలు ముట్టజెప్పి.. అసిస్టెంట్‌ జైలర్‌ కార్యాలయంలో తరచూ కలుసుకొనేవారని తాజా దర్యాప్తులో తేలింది. షివోహర్ జిల్లా మేజిస్ట్రేట్‌, ముజఫర్‌పుర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఈ దర్యాప్తు నిర్వహించారు.

ఉత్తర బిహార్‌లో బలమైన నేరగాడైన సంతోష్‌ షా గ్యాంగ్‌లో షార్ప్‌షూటర్‌ అయిన ముఖేశ్‌ పాఠక్‌ దర్భాంగ ఇంజినీర్ల హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి పరారైన అతడు ప్రస్తుతం నేపాల్‌లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement