
రాందేవ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారా?
వివిధ రకాల ఉత్పత్తులతో వ్యాపారపరంగా తన సత్తాను చాటుతున్న యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు రెస్టారెంట్ల బిజినెస్లోకి అడుగుపెట్టారా? అంటే అవునంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
న్యూఢిల్లీ: వివిధ రకాల ఉత్పత్తులతో వ్యాపారపరంగా తన సత్తాను చాటుతున్న యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు రెస్టారెంట్ల బిజినెస్లోకి అడుగుపెట్టారా? అంటే అవునంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పుడు పతంజలికి చెందినదన్నట్లుగా ఓ రెస్టారెంటు ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చండీగఢ్లో ‘పోష్టిక్ రెస్టారెంటు’ అనే పేరుతో ఉన్న ఈ రెస్టారెంటుపై రాందేవ్ బాబా ఫోటో కూడా ఉంది. పైగా దానిపై పతంజలి గుర్తు కూడా ఉంది. దీంతో అసలు రాందేవ్ బాబా రెస్టారెంటు ఎక్కడ పెట్టారు? ఎప్పుడు పెట్టారు? అంటూ తెగవెతకడం ప్రారంభించారు.
దీంతో అసలు విషయం బయటకొచ్చింది. ఆ రెస్టారెంటు యజమాని వివరణ ఇచ్చాడు. అలోక్ శర్మ అనే రిటైర్డ్ కల్నల్ మాట్లాడుతూ ఆ రెస్టారెంటు రాందేవ్బాబాది కాదని, కాకపోతే తాము పతంజలి ఉత్పత్తులను తమ రెస్టారెంటులో వాడతామని, ఎంతో పోషక విలువలతో కూడిన వంటలు సిద్ధం చేస్తామని అందుకే అలా రెస్టారెంటు పేరు పెట్టినట్లు వివరించాడు. ఈ విషయం తెలియని మీడియా, సోషల్ మీడియా రాందేవ్ బాబానే ఈ రెస్టారెంటు పతంజలి బ్రాండ్ కింద తెరిచినట్లుగా తెగ వార్తలు వచ్చాయి.