మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయినట్లు తెలుస్తోంది.
రాయల తెలంగాణపైనే మంతనాలు?
సాక్షి, న్యూఢిల్లీ: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుకుంటున్న మజ్లిస్ అధినేత సోనియా ఆహ్వానంపైనే ఆమె నివాసంలోనే కలిసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. హైద్రాబాద్ రాజధానిగా తెలంగాణలోని పది జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించినప్పటికీ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలిపి 12 జిల్లాలతో రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను కూడా ఆంటోనీ కమిటీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
సీఎం కిరణ్పై తీవ్ర విమర్శలు గుప్పించి యూపీఏ కూటమినుంచి వైదొలగిన మజ్లిస్నేతతో సోనియా ప్రత్యేకంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్ర విభజన నిర్ణయంతో తీవ్రంగా విభేదిస్తున్న ఎంపీ కేవీపీ రామచంద్రరావు బుధవారంనాడిక్కడ దిగ్విజయ్సింగ్ను కలుసుకొని చర్చలు జరిపారు.