ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా జాతీయ గేయం వందేమాతరంకు చట్టపరమైన హక్కులను ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు.వందేమాతరాన్ని జాతీయ గీతంతో సమానంగా పరిగణించలేమని ఒవైసీ స్పష్టం చేశారు.
అసదుద్దీన్ మాట్లాడుతూ.."వందేమాతరం ఒక దేవతను స్తుతించే గేయం, భారతదేశం ఏ ఒక్క దేవుడి పేరు మీదో లేదా దేవత పేరు మీదో నడవదు ఈ గేయాన్ని రాసిన వ్యక్తి బ్రిటీష్ రాజ్కు సానుభూతిపరుడు, ముస్లింలను ద్వేషించేవారు. గాంధీ, నెహ్రూ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా దీనిని తిరస్కరించారు." అని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది తప్ప "భారతమాత" అని కాదని ఆయన వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల కలయిక అని, ఇది ప్రజల దేశమని ఆయన పేర్కొన్నారు. గతంలో రాజ్యాంగ పరిషత్తులో కొందరు సభ్యులు పీఠికను దేవత పేరుతో లేదా దేవుడి పేరుతో ప్రారంభించాలని కోరారని, కానీ ఆ ప్రతిపాదనలన్నీ అప్పట్లోనే వీగిపోయాయని ఆయన గుర్తు చేశారు.
కాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఒవైసీ నాయకత్వం.. దేశ సాంస్కృతిక సమైక్యతను ముప్పుగా భావిస్తోందని, ఆయన వైఖరి గతంలో జిన్నా అనుసరించిన ధోరణిని పోలి ఉందని విమర్శించారు. జిన్నా కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వందేమాతరాన్ని వ్యతిరేకించలేదని, పార్టీ విడిపోయాకే వ్యతిరేకత మొదలుపెట్టారని గుర్తు చేశారు... రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఒవైసీ గతంలోనూ యూనిఫాం సివిల్ కోడ్ (UCC), త్రిపుల్ తలాక్ రద్దు వంటి జాతీయ సమగ్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒవైసీ వ్యతిరేకిస్తున్నారని బీజేపీ మండిపడింది.
వందేమాతరంపై కేంద్రం నిర్ణయం
వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 'జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971' కు సవరణలను ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచినా లేదా దాని ఆలాపనకు ఆటంకం కలిగించినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. అంతకుముందు ఈ రక్షణ కేవలం జా
తీయ గీతం జాతీయ జెండా మరియు రాజ్యాంగానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు వందేమాతరం కూడా అదే జాబితాలోకి చేరింది.


