హైపర్టెన్షన్ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: హైపర్టెన్షన్ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాతీయ హైపర్టెన్షన్ డే పురస్కరించుకుని జగిత్యాలరూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జగదీశ్, ల్యాబ్ టెక్నీషియన్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి ఆవాసంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంజగిత్యాలటౌన్: సేవాభారతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవా సంలో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆవాసం అధ్యక్ష, కార్యదర్శులు జిడిగె పురుషోత్తం, నందెల్లి మదన్మోహన్రావు శుక్రవారం తెలిపారు. తల్లిదండ్రులు లేనివారు, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పేద కుటుంబాలకు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 2 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారని, ఆసక్తిగల వారు ఈనెల 31లోపు ఆవాసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జగిత్యాల పట్టణానికి చెందిన విద్యార్థులు అర్హులు కాదని తెలిపారు. జూన్ 1న విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94944 31893, 99892 48893 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
బెస్ట్ అవేలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి..జగిత్యాల: జిల్లాలోని బెస్ట్ అవేలబుల్ స్కూళ్లలో (రెసిడెన్షియల్/నాన్ రెసిడెన్షియల్) 2024–25 సంవత్సరానికి 1, 5వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్కుమార్ తెలిపారు. 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్కు దరఖాస్తు చేసుకోవచ్చని, 1వ తరగతి 75 సీట్లు, 5వ తరగతిలో 76 సీట్లు కేటాయించబడునని పేర్కొన్నారు. విద్యార్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లభిస్తాయని, తగిన ధ్రువ పత్రాలతో జూన్ 7లోపు కార్యాలయంలో సమర్పించాలన్నారు. జూన్ 11న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారని, ఒక కుటుంబం నుంచి ఒకరికే అర్హత ఉంటుందన్నారు. మిగతా వివరాలకు 63028 82400 నంబర్లో సంప్రదించాలని కోరారు.
అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్కోరుట్లరూరల్: కోరుట్ల పోలీస్స్టేషన్లో నమోదైన ఓ యాక్సిడెంట్ కేసులో అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోరుట్ల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పునిచ్చారని నిందితుడి తరఫు న్యాయవాది సంగ విజయ్సాయి ప్రకటనలో తెలిపారు. సాక్షులుగా ఉన్న డాక్టర్ సయ్యద్ అహ్మద్, ఎంవీఐ కిషన్రావు, ఎస్ఐ జయేశ్రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో జడ్జి పావని నాన్బెయిలబుల్ వారెంటు జారీ చేశారు.
గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టండిఇబ్రహీంపట్నం(కోరుట్ల): అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం గోదూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలం చిట్టాపూర్, మేడిపల్లి మండలం మోహన్రావుపేట, కోరుట్ల మండలం అయిలాపూర్, జగిత్యాల మండలం చల్గల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎంపీవో కృపాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.