
ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటాం
తాము తప్పుచేసినట్లు రాతపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు.
న్యూఢిల్లీ: తాము తప్పుచేసినట్లు రాతపూర్వకంగా ఒప్పుకుంటే జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. భారత్లోని కాలుష్య ఉద్గారాల నియమాలకు అనుగుణంగా కార్లు రూపొందించలేదని ఆ కంపెనీ రాతపూర్వకంగా వెల్లడించాలన్నారు. గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... గతంలోనే ఆ కంపెనీ తన తప్పును ఒప్పుకుందని, ఇక రాతపూర్వకంగా, ఏదైనా డాక్యుమెంట్లోనైనా ఆ విషయాన్ని పేర్కొన్న తర్వాత ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు చేపడతామని చెప్పారు.
వాహనాలను వెనక్కి తీసుకోవాలని ఆ కంపెనీకి ఇదివరకే చెప్పామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించడానికి ఫోక్స్ వ్యాగన్ మోటార్ స్పోర్ట్ ఇండియా చీఫ్ శిరిష్ విస్సా నిరాకరించారు. కంపెనీ పేరు తిరిగి సంపాదించడానికి కార్లను తిరిగి తీసుకుని వాటి ఇంజన్లను మార్చి ఇస్తామని.. అవసరమైతే రీప్లేస్ చేస్తామని ఆ కంపెనీ అధికారులు గతంలోనే ప్రకటించారు. 3.23 లక్షల ఆడీ, స్కోడా, ఫోక్స్ వ్యాగన్ కార్ల పాత ఇంజన్ల స్థానంలో సరైన వాటిని అమర్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.