
ఆరుషి తల్లికి పెరోల్
తమ కూతురు ఆరుషి హత్య కేసులో జీవితఖైదు పడిన ఆమె తల్లి నుపుర్ తల్వార్ కు పెరోల్ లభించింది.
న్యూఢిల్లీ: తమ కూతురు ఆరుషి హత్య కేసులో జీవితఖైదు పడిన ఆమె తల్లి నుపుర్ తల్వార్ కు పెరోల్ లభించింది. ఆమెకు అలహాబాద్ హైకోర్టు మూడు వారాలు పెరోల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో ఆమెకు ఊరట లభించింది. ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్(45) హత్య కేసులో భర్త రాజేశ్ తల్వార్ తో కలిసి నుపుర్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
నోయిడాలోని తల్వార్ ఇంటిలో ఆరుషి, హేమరాజ్ 2008, మే 15-16న హత్యకు గురయ్యారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసులు ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు 2013, నవంబర్ లో ఆరుషి తల్లిదండ్రులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు.