
అలహాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రానికి కూడా పరిమితులు ఉంటాయని.. సైన్యాన్ని కించపరచకూడదని పేర్కొంది. చైనాతో గాల్వాన్ ఘర్షణలపై రాహుల్ చేసిన కామెంట్స్ను అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది.
2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు సమన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.
రాహుల్ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం.. వాక్ స్వాతంత్య్రం హక్కులో ఏ వ్యక్తికైనా, సైన్యానికి అయినా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్చ లేదంటూ స్పష్టం చేసింది. భవిష్యత్ లో సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ గాంధీని హైకోర్టు మందలించింది.
కాగా, 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లో భారత ఆర్మీపై దాడులు చేస్తున్నారని.. సైనికులను కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చైనా 2000 కిలో మీటర్ల భారత భూ భాగాన్ని ఆక్రమించి, 20 మంది భారత సైనికులను చంపేసిందని రాహల్ ఆరోపణలు చేశారు. ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీ చేసింది.