మాస్కుల ప‌రిశ్ర‌మ‌లో 70 మందికి క‌రోనా | 70 Workers In Mask Making Unit Tests Coronavirus Positive In Puducherry | Sakshi
Sakshi News home page

మాస్కుల ఫ్యాక్ట‌రీలో క‌రోనా క‌ల్లోలం: సీఎం సీరియ‌స్‌

Jun 25 2020 7:52 PM | Updated on Jun 25 2020 8:09 PM

70 Workers In Mask Making Unit Tests Coronavirus Positive In Puducherry - Sakshi

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో మాస్కులు త‌యారు చేసే యూనిట్‌లో పెద్ద మొత్తంలో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. బుధ‌వారం ఒక్క‌రోజే ఆ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే 40 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసిన‌ 70 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి వి.నారాయ‌ణ‌స్వామి గురువారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ప్లాంట్ నిర్వాహ‌కులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వల్లే 70 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. (పరుగో పరుగు!)

దీనికి కార‌ణ‌మైన స‌ద‌రు ప్లాంట్‌ను వెంట‌నే సీల్ చేయాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీన్ని న‌డుపుతున్న ప్రైవేటు కంపెనీపైనా క్రిమిన‌ల్‌ కేసు న‌మోదు చేసిన‌ట్లు మీడియాకు వెల్ల‌డించారు. వైర‌స్ సోకిన కార్మికులు ఫ్యాక్ట‌రీకి ఏయే గ్రామాల నుంచి వ‌స్తారో వాటిపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో వీరికి స‌న్నిహితంగా మెదిలిన వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌ పుదుచ్చేరిలో ఇప్ప‌టివ‌ర‌కు 461 కేసులు న‌మోద‌వ‌గా ఇందులో 276 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement