సురక్షిత ప్రాంతాలకు 5 లక్షల మంది | 500,000 people were shifted to safety in coastal Odisha and Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రాంతాలకు 5 లక్షల మంది

Oct 13 2013 2:16 AM | Updated on Sep 1 2017 11:36 PM

తుపాను ప్రభావం ఎక్కువగా పడే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల నుంచి 5.25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోం సెక్రటరీ అనిల్ గోస్వామి తెలిపారు.

న్యూఢిల్లీ: తుపాను ప్రభావం ఎక్కువగా పడే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల నుంచి 5.25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోం సెక్రటరీ అనిల్ గోస్వామి తెలిపారు. ఒడిశాలో 4.25 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మందిని 500 రక్షిత కేంద్రాలకు తరలించినట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు, ఒడిశా తీరప్రాంతంలో విద్యుత్ నిలిపివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఒడిశాలో 1500 మెగావాట్లు, ఏపీలో 500 మెగావాట్లు విద్యుత్ వినియోగం తగ్గిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
 
 హైవేలను మరమ్మతు చేయండి
 
 పై-లీన్ తుపాను కారణంగా హైవేలు ఎక్కడైనా ధ్వంసమైతే ఆ ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర రోడ్లు, హైవేల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. తుపాను ప్రభావం పడే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్‌కు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఒక ప్రకటనలో ఆదేశించింది. దీనికోసం ఒక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామని తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement