అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది | theri movie Audio Launch | Sakshi
Sakshi News home page

అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది

Mar 22 2016 2:44 AM | Updated on Jul 12 2019 4:40 PM

అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది - Sakshi

అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది

ఆరంభకాలం నుంచి అభిమానులందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఇలయదళపతి విజయ్ వ్యాఖ్యానించారు.

ఆరంభకాలం నుంచి అభిమానులందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఇలయదళపతి విజయ్ వ్యాఖ్యానించారు. ఈయన నటించిన 59వ చిత్రం తెరి. ముద్దుగుమ్మలు సమంత, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకతలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు అర్ధ శత చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. వందలాది మంది విజయ్ అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ మాట్లాడుతూ సాధారణంగా ఇలాంటి వేడుకల్లో సంగీత దర్శకులే హీరోలన్నారు. అయితే హీరో అయిన జీవీ ప్రకాశ్‌కుమార్‌నే ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషంగా పేర్కొన్నారు. జీవీ విర్జిన్ యువత హీరో అని వ్యాఖ్యానించారు.

 మహేంద్రన్ దర్శకత్వంలో అవకాశం కోసం
ఇక దర్శకుల హీరోగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అన్నారు. ఆయన పేరు చెప్పగానే గుర్తు కొచ్చే చిత్రం ముల్లుమ్ మలరుమ్ అన్నారు. ఉదిరిపూక్కళ్ లాంటి పలు గొప్ప చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ దర్శకత్వంలో నటించే అవకాశం రాదా? అను ఎదురు చూస్తుండగా ఆయనే తన చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు.

 సెల్ఫీ పుళ్ల కుల్ఫీ పుళ్ల
ఇందులో ఇద్దరు బ్యూటీఫుల్ హీరోయిన్లు నటించారన్నారు. వారిలో ఒకరు సెల్ఫీ పుళ్ల సమంత కాగా కుల్ఫీ పుళ్ల ఎమీజాక్సన్ మరొకరనీ అన్నారు. వీరిద్దరికీ సమాన పాత్రలని తెలిపారు. ఇకపోతే రాజారాణి వంటి అందమైన ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు అట్లీ తనతో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న వెర్రితో తీసిన చిత్రమే ఈ తెరి అన్నారు.ఆయన చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు.

 పులి లాంటి నిర్మాత
మనం టీవీలో డిస్కవరి ఛానల్‌లో గుంపుగా ఉన్న జింకలో ఒక దానిపై గురి పెట్టిన పులి దాన్ని వెంటాడి చంపి తింటుందన్నారు. ఇక్కడ జింక విజయం అయితే దాన్ని వేటాడి సాధించే  పులి నిర్మాత కలైపులి ఎస్.థాను అని వర్ణించారు. అలా విజయం కోసం వేటాడి సాధించే నిర్మాత ఆయనని అన్నారు.

 అభిమానులు ఉన్నత స్థాయికి ఎదగాలి
ఇక తనకు ఆరంభ కాలం నుంచి అండదండగా నిలిచింది అభిమానులేనన్నారు. వారి ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరానన్నారు. తన అభిమానులూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటి మీనా కూతురు నైనిక హైలైట్‌గా నిలిచారు. ఈ చిన్నారి తెరి చిత్రంలో విజయ్ కూతురుగా నటించింది. ఈ చిత్రం ఆడియోనూ తనే ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో నటి ఎమీజాక్సన్, మీనా, జీవీ ప్రకాశ్‌కుమార్,ప్రభు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement