తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు

Taapsee Pannu, Aadhi Pinisetty and Ritika Singh at Neevevaro press meet - Sakshi

కోన వెంకట్‌

‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్‌ వారు 100 శాతం డెడికేషన్‌తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్‌ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా హరినాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్‌ ప్రెస్‌మీట్‌లో కోన వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్‌ ప్రత్యేకంగా ఉంటుంది.

20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్‌ శంకర్‌ని, గోపీచంద్‌ మలినేని, గోపీమోహన్‌ని, దశరథ్‌ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్‌... ఇంకొంత మంది ఫ్రెండ్స్‌కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్‌బస్టర్‌ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్‌ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ.

ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్‌ ప్రదీప్‌ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్‌ డెడికేషన్‌ ఈ సినిమాకు చాలా ప్లస్‌ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్‌లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు హరినాథ్‌. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top