ముంబైకి తిరిగొచ్చిన సోనాలీ బింద్రే | Sonali Bendre Returned To Mumbai | Sakshi
Sakshi News home page

Dec 3 2018 9:40 AM | Updated on Dec 3 2018 10:03 AM

Sonali Bendre Returned To Mumbai - Sakshi

ముంబై: క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న హీరోయిన్‌ సోనాలీ బింద్రే ముంబైకు తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు స్నేహితులు, బంధువులు స్వాగతం పలికారు. సోనాలీతో పాటు ఆమె భర్త గోల్డీ బెహల్‌ కూడా ఉన్నారు. ఈ సమయంలో సోనాలీ తనను చూడటానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినవారికి అభివాదం తెలుపుతూ.. నవ్వుతూ కనిపించారు. గత కొంత కాలంగా హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలీ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

అంతకుముందు తను భారత్‌కు వస్తున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసిన సోనాలీ.. తనకు క్యాన్సర్‌ ఇంకా నయం కాలేదని పేర్కొన్నారు. భారత్‌లో సాధారణ జీవితం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘నా హృదయం ఎక్కడైతే ఉందో(భారత్‌) అక్కడికి బయలుదేరుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కానీ నేను ప్రయత్నిస్తాను.. చాలా రోజుల తరువాత నా కుటుంబాన్ని, మిత్రులను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. కాన్సర్‌తో నా పోరాటం ఇంకా ముగియలేదు. కానీ ఈ సమయాన్ని నేను ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాన’ని సోనాలీ ఆ సందేశంలో పేర్కొన్నారు. 

సోనాలీ ఆరోగ్య పరిస్థితిపై గోల్డీ మాట్లాడుతూ.. సోనాలీ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. తను వేగంగా కోలుకుంటుందని.. ప్రస్తుతానికి చికిత్స ముగిసిందని పేర్కొన్నారు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరిగి రావచ్చు.. అందుకే రెగ్యూలర్‌​గా చెకప్‌లు చెయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement