రూటు మార్చిన శాలిని

Shalini Pandey Put Focus On Tamil Movies - Sakshi

చెన్నై : నటి శాలిని పాండే తన రూటు మార్చేసిందా? అవుననే బదులే కోలీవుడ్‌ నుంచి వస్తోంది. ఈ జైపూర్‌ బ్యూటీ నిజంగా లక్కీఅనే చెప్పాలి. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడి నట జీవితాన్ని అర్జున్‌రెడ్డి సినిమా ఒక్కసారిగా మార్చేసింది. ఆ చిత్రంతో వచ్చిన పాపులారిటీ కోలీవుడ్‌ ఎంట్రీకీ పనిచేసింది. ఇక్కడ 100% కాదల్‌ చిత్రంతో తమిళసినిమా పరిశ్రమకు పరిచయం అయినా.. ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. అదే కాదు నడిగైయార్‌ తిలకం(మహానటి) చిత్రం మినహా ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా కోలీవుడ్‌లో విడుదల కాలేదు. నడిగైయార్‌ తిలగం చిత్రంలో శాలినిపాండేది నిమిత్త మాత్రం పాత్రే. ప్రస్తుతం జీవాతో జత కట్టిన గొరిల్లా చిత్రంతో పాటు విజయ్‌ఆంటోనితో అగ్రిసిరగుగళ్, అనుష్కతో కలిసి సైలెన్స్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు చిత్రాలే కోలీవుడ్‌లో నటిగా శాలినిపాండే స్థానాన్ని డిసైడ్‌ చేయాలి. వీటిలో జీవాతో రొమాన్స్‌ చేసిన గొరిల్లా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై శాలినిపాండే చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఆ చిత్రాలను నమ్ముకుంటూనే కొత్తగా అవకాశాల కోసం వేట మొదలెట్టిందని సమాచారం.

ముఖ్యంగా ఈ అమ్మడు నటించింది తక్కువ చిత్రాలే అయినా హోమ్లీ ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు దాన్ని చెరిపేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టేసింది. అంతే కాదు వచ్చే ఏడాది కల్లా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోవాలని కలలు కంటోందట. ఆ కలలను సాకారం చేసుకోవడానికి గ్లామర్‌ ఒక్కటే మార్గం అని భావించిన శాలినిపాండే ఆ దిశగా అడుగులు మొదలెట్టేసింది. ఏకంగా ఈత దుస్తుల్లో ఫొటో షూట్‌ చేయించుకుంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. అవి ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో పాటు పలువురి లైక్స్‌ పొందుతున్నాయి. అలా శాలినిపాండే వార్తల్లో నానుతోంది. రెండు హింది చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు అధిక దృష్టిని కోలీవుడ్‌పైనే సారిస్తోందట. ఎందుకంటే తెలుగులో ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుండడంతో తమిళ సినిమానే నమ్ముకుంటోందని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top