సైరాకి షాక్‌.. సెట్స్‌ కూల్చివేత

Revenue Authorities Demolished Sye Raa Narasimha Reddy Sets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’  చిత్రానికి హైదరాబాద్‌ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. ఈ చిత్ర నిర్మాత మెగాస్టార్‌ తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ జరిగిన సెట్స్‌లోనే ప్రస్తుతం సైరా షూటింగ్ జరుగుతోంది. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్‌లో రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఇప్పుడు సైరా చిత్రం కోసం అక్కడ సెట్స్ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు.

ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని తెలిపారు. అనుమతి తీసుకోకుండా సెట్ వేయడమే చిత్ర యూనిట్ చేసిన తప్పు అని, అనుమతులు కోరితే ఉచితంగానైనా పర్మిషన్ ఇచ్చి ఉండేవారమని అధికారులు పేర్కొన్నారు. భూకబ్జాకు ఇది ముందస్తు ప్లాన్ అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనుమతుల్లేకుండా సెట్ వేసి, ఆ తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనేది చిత్ర యూనిట్ ప్రణాళికలో ఓ భాగమని అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకనే కూల్చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top