అమెరికాలో రవితేజ, శ్రీను వైట్ల కొత్త చిత్రం
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా అంటే చాలు సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు నీకోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఆ సక్సెస్ ఫార్ములాను కొనసాగిస్తూ రవితేజ, శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో చిత్రం నటించనున్నారు.
ఈ చిత్రం ఈ నెల 19 నుండి ప్రారంభంకానుంది. తొలి షెడ్యూల్ను అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే క్రేజీ టైటిల్ పెట్టే ఆలోచనలో శ్రీను వైట్ల ఉన్నట్లు సమాచారం. సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నారట. ఈ మూడు భిన్న పాత్రల్లో రవితేజ అలరిస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉండనున్నారు. రవితేజ ఏప్రిల్ నుంచి షూటింగ్లో పాల్గొంటారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిర్మించనుంది.
ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తారు. తాజాగా ఆయన నటించిన ‘టచ్ చేసి చూడు’ ప్రేక్షకుల్ని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.