కార్తీతో మళ్లీ..

Rakul Preeth Sing Teamup With Karthi Again - Sakshi

తమిళసినిమా: నటుడు కార్తీ, నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తీ, రకుల్‌ మధ్య రొమాన్స్‌ సన్నివేశాలు బాగా వర్కౌట్‌ అయ్యాయి. తాజాగా ఈ జోడి మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై రొమాన్స్‌కు రెడీ అయ్యింది. సరవణన్, ఆర్‌.కన్నన్, బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రజత్‌ రవిశంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ  చిత్రాన్ని రిలయన్స్‌ సంస్థ సమర్పణలో ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. 

ఇది కార్తీకు 17వ చిత్రం. ఈ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కార్తీ తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌ అతిథిగా విచ్చేసి క్లాప్‌ కొట్టగా, నటుడు సూర్య కెమెరా స్విచ్ఛాన్‌ చేసి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందులో సీనియర్‌ నటుడు కార్తీక్‌ కీలక పాత్ర పోషించనుండటం మరో విశేషం. ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్, ఆర్‌జే.విఘ్నేశ్‌కాంత్‌ నటిస్తున్నారు. దీనికి హారీష్‌ జయరాజ్‌ సంగీతం, వేల్‌రాజ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ నెల 8 నుంచి 15 రోజుల పాటు చెన్నైలో షూటింగ్‌ నిర్వహించినున్నట్లు, ఆ తరువాత హైదరాబాద్, ముంబై, యూరప్‌ దేశాలు, హిమాలయాల్లోనూ చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి 2డీ.ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రాజశేఖర్‌ పాండియన్, దర్శకుడు పాండిరాజ్, మాదేశ్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top