
సాక్షి, హైదరాబాద్: నగర రోడ్లపై ప్రయాణం రోజురోజుకు నరకప్రాయంగా మారుతోంది. ఇందుకు ప్రకృతి సంబంధ కారణాలు కొన్నయితే, మానవ సంబంధిత అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు వెళ్లే సమయంలో ఆయా మార్గాల్లో ప్రొటోకాల్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో తాను ఓ ప్రాంతంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయానంటూ టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు సామాన్య వ్యక్తులుగా నగరంలో ప్రయాణిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు.
అసలు విషయం ఏంటంటే.. నగరంలోని హైటెక్స్ ఏరియాలో నటి మంచు లక్ష్మీ గంటన్నర సమయం పాటు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీంతో 'గంటన్నర సమయం హైటెక్స్ ఏరియాలో ట్రాఫిక్ కారణంగా చిక్కుకున్నాను. రాజకీయ నాయకులు మాలాగ సాధారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతోందంటూ' ఆమె ట్వీట్ ద్వారా సమస్యను షేర్ చేసుకున్నారు. చాలామంది నెటిజన్లు ఆమెకు మద్ధతు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు.
I've been stuck around hitex for 11/2hr. Grrrrrrrr. Politicians here should drive like us without protocol to see what we go thru.😤
— Lakshmi Manchu (@LakshmiManchu) 5 October 2017