'పాక్లో నా ఫొటోలు తగలబెడుతున్నారు' | Sakshi
Sakshi News home page

'పాక్లో నా ఫొటోలు తగలబెడుతున్నారు'

Published Sat, Aug 8 2015 11:29 AM

'పాక్లో నా ఫొటోలు తగలబెడుతున్నారు'

సంతోషం వెంటే విషాదాన్నీ చవిచూస్తున్నాడు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ! భారత్లో ఎంతకాలమైనా నివసించవచ్చనే అనుమతి దొరకడం ఓవైపు.. స్వదేశం పాకిస్థాన్లో తనపై పెల్లుబిగుతోన్న ప్రజాగ్రహం మరో వైపు. రెండింటి నడుమ నలిగిపోతూ తన బాధను మీడియాతో పంచుకుని కాస్త ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు సమీ..

పాకిస్థాన్ ప్రభుత్వం తన వీసాను పునరుద్ధరించకపోవడంతో చిక్కుల్లో పడ్డ ఆయన.. 'నన్ను మీ గడ్డ మీదే నివసించే అవకాశమివ్వండి' అని భారత ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాడు. అందుకు ప్రభుత్వం అంగీకరించడం ఆ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. దాంతో  పాకిస్థాన్‌ పౌరసత్వాన్ని త్యజిస్తు న్నట్టు  అద్నాన్‌ సమీ పేర్కొ న్నాడు. ఇకపై తన పాకిస్థాన్‌ పౌరసత్వాన్ని వదిలేస్తున్నానని, 14 ఏళ్లుగా తనకు ఆశ్ర యమిచ్చిన భారత్ నే ఇకపై తన సొంతగడ్డ అని అతడు పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే భారత్లోనే ఉండాలనుకుంటున్న సమీ నిర్ణయంపై పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. 'నా స్వదేశస్తులకు నా మీద కోపం పెరిగిపోయింది. అక్కడ నా ఫోటోలను తగలబెడుతున్నారు. ఇది నన్నెంతగానో బాధపెడుతోంది. కానీ ఏం చేస్తాం! ఇండియా అన్నా.. ఇక్కడ నివసించడమన్నా నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తా' అని కళ్లు చెమర్చాడు అద్నాన్ సమీ.

Advertisement
Advertisement