అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది | Operation Gold Fish pre release | Sakshi
Sakshi News home page

అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది

Oct 15 2019 12:22 AM | Updated on Oct 15 2019 5:02 AM

Operation Gold Fish pre release - Sakshi

అబ్బూరి రవి, అడివి శేష్, జీవిత, రాజశేఖర్, ఆది, శాషా, నిత్య, కార్తీక్‌ రాజు, సాయి కిరణ్‌

‘‘యంగ్‌ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ అనే సినిమా చేశారు. నేనూ అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతుంటా... నాకు కథ నచ్చితే రెమ్యునరేషన్‌ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులొస్తేనే ఇవ్వమని చెబుతా. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని నటుడు రాజశేఖర్‌ అన్నారు. ఆది సాయికుమార్‌ హీరోగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్‌ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’.

ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్‌ డేగలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సాయి కిరణ్‌ అడివి మాట్లాడుతూ– ‘‘1990లలో కశ్మీర్‌లో పండిట్లకు ఏం జరిగిందో అందరికీ తెలియాలని చేసిన ప్రయత్నం ఇది. ఆది ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం సాయికుమార్‌గారు.. ఆయనకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కశ్మీర్‌ పండిట్ల ఎమోషన్‌ను క్యాష్‌ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు.

మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని తీశాం’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘నాకు ఈ సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌’’ అన్నారు ఆది సాయికుమార్‌. ‘‘ఆది మా అబ్బాయిలాంటివాడు’’ అన్నారు జీవితారాజశేఖర్‌. ‘‘ఈ ఫంక్షన్‌కి నేను ఆది కుటుంబ సభ్యుడిగా వచ్చాను.’’ అన్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ‘‘ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి. నిర్మాతలు కేశవ్, ప్రతిభ, హీరో అడివి శేష్, నటులు కృష్ణుడు, మనోజ్‌ నందం, పార్వతీశం, కార్తీక్‌ రాజు, అనీష్‌ కురువిళ్ల, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల, నిర్మాత రాజ్‌ కందుకూరి  పాల్గొన్నారు. కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్‌ యాదవ్‌ (వైజాగ్‌).

Advertisement
 
Advertisement
Advertisement