శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని | Mahesh Babu Speech At Bharat Ane Nenu Blockbuster Celebrations | Sakshi
Sakshi News home page

దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా

Apr 29 2018 12:07 AM | Updated on May 10 2018 12:13 PM

Mahesh Babu Speech At Bharat Ane Nenu Blockbuster Celebrations - Sakshi

దేవిశ్రీ ప్రసాద్, మహేశ్‌ బాబు, డీవీవీ దానయ్య, కొరటాల శివ

‘‘డిస్ట్రిబ్యూటర్స్‌ అందరినీ హ్యాపీగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మగారు పుట్టినరోజున ఈ సినిమా రిలీజైంది. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరకు డిస్ట్రిబ్యూటర్స్‌ షేర్స్‌ ఇలానే చెబుతుండాలి. నాన్నగారి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్‌ అందరూ నన్ను సూపర్‌స్టార్‌ సూపర్‌స్టార్‌ అంటారు. ఆ సూపర్‌స్టార్‌కి నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు లైఫ్‌ ఇచ్చారు శివగారు. మీకెప్పుడూ రుణపడి ఉంటాను సార్‌’’ అన్నారు మహేశ్‌బాబు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా  డీవీవీ దానయ్య నిర్మించిన ‘భరత్‌ అనే నేను’ సినిమా ఈ నెల 20న రిలీజై సక్సెస్‌ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన బ్లాక్‌ బ్లస్టర్‌ సెలబ్రేషన్స్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పది రోజులుగా నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్‌ చేస్తున్నాను. విజయవాడకు వెళ్లాను. తిరుపతికి వెళ్లాను. సినిమా రిలీజైన తర్వాత నన్ను పడుకోనివ్వకుండా  చేస్తున్నారు శివగారు.  ఈ రోజులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

ఇందాక అందరికీ షీల్డ్స్‌ ఇచ్చాం. అది నాకు బాగా నచ్చింది. శ్రీకర్‌ ప్రసాద్‌గారు సినిమాను ఎడిట్‌ చేస్తే ఒక టెక్ట్స్‌ బుక్‌లా ఉంటుంది. దేవి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. దానయ్యగారూ.. మీరు ఇలానే గొప్ప సినిమాలు తీయాలి. నాన్నగారు, నా అభిమానుల స్పందనకు థ్యాంక్స్‌. మీ రెస్పాన్స్‌ని  ఎప్పుడూ మర్చిపోలేను. ఇలానే శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో  సినిమాలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అన్నారు మహేశ్‌బాబు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో బిగ్‌ బడ్జెట్‌ మూవీ ఇది. కాంప్రమైజ్‌ కాకుండా దానయ్యగారు నిర్మించారు.

ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్‌లా ఆయన ఇలానే ఉండాలి. ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి మహేశ్‌బాబుతో నాకు అసోసియేషన్‌ ఉంది. మంచి కథ రాసుకుంటే నా పని అయిపోయినట్లే. మంచి యాక్టర్‌ ఉన్నాడన్న ధైర్యం. మహేశ్‌గారితో హాట్రిక్‌ కాంబినేషన్‌ కోసం ఎదురుచూస్తున్నాను. రైటర్‌ శ్రీహరి నాను.. మహేశ్‌గారి ఫ్యాన్‌. మహేశ్‌ క్యారెక్టర్‌ సీయం అయితే బాగుండు అన్న ఆలోచన హరిదే. కథ నాకు ఇచ్చి నా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్‌. ‘రంగస్థలం’ సినిమా రాగానే సగం టెన్షన్‌ పోయింది.

ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్‌ స్ట్రీక్‌ జాయిన్‌ అయిపోయిందని టెన్షన్‌ తగ్గిపోయింది. వెంటనే మరో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నా బ్యానర్‌లో ఇంత గొప్ప సినిమా, గర్వపడే సినిమా తీసిపెట్టిన డైరెక్టర్‌ శివగారికి,  హీరోగా చేసిన మహేశ్‌బాబుగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాకు ఏ సినిమాకూ ఇంత ఎప్రిషియేషన్‌ రాలేదు. నాకు తెలియనివారు కూడా .. ‘గొప్ప సినిమా తీశారు’ అని సెల్ఫీలు దిగుతుంటే ఆనందంగా ఉంది. శుక్రవారం కలెక్షన్స్‌ చెప్పాం. ప్రపంచవ్యాప్తంగా 161.28కోట్లు వసూలు చేసింది. ఇవి ఒరిజినల్‌ కలెక్షన్స్‌.

మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఆనందంగా ఉన్నారు’’ అన్నారు దానయ్య. ‘‘ఈ సినిమా సక్సెస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫేస్‌లలో కనిపించింది. మహేశ్‌బాబుగారే కాదు ఆయన హార్ట్‌ కూడా సూపర్‌స్టార్‌’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. ‘‘ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొరటాల చాలా సంపాదించాడు అనుకుంటారు. కానీ ఎక్కువ పోగొట్టుకున్నాడు. వాడి కథలను చాలా మంది కాజేసారు. లేకపోతే ఈపాటికే ఓ పది సినిమాలు సూపర్‌హిట్‌ కొట్టేవాడు. మహేశ్‌ చాలా అందంగా ఉంటాడు. అతని మనసు ఇంకా అందంగా ఉంటుంది. నా కొడుకు ప్రజ్వల్‌ ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాడు’’ అన్నారు పోసాని. ‘‘ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్‌లు మళ్లీ మళ్లీ రావాలి’’ అన్నారు రామజోగయ్యశాస్త్రి. డిస్ట్రిబ్యూటర్స్‌ పాల్గొని సినిమా విజయానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. మహేశ్‌బాబు డిస్ట్రిబ్యూటర్స్‌కు మెమొంటోలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement