‘సరిలేరు నీకెవ్వరు’: దూకుడు మహేశ్‌ ఈజ్‌ బ్యాక్‌!

Mahesh Babu Sarileru Neekevvaru Telugu Movie Twitter Review - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో మహేశ్‌, అనిల్‌ సుంకరలు నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకపోతోంది. శుక్రవారం అర్దరాత్రి నుంచే ప్రత్యేక షోలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ షోలు పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక, ప్రీమియర్‌ షోలు చూసిన ప్రతీ ఒక్కరు చెబుతున్న మాట దూకుడు మహేశ్‌ ఈజ్‌ బ్యాక్‌ అని. ఈ మధ్య కాలంలో మహేశ్‌ వరుసగా సందేశాత్మక చిత్రాలు చేస్తుండటంతో అయన నుంచి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఫ్యాన్స్‌ ఆశించారు. అయితే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేశ్‌ అభిమానులు వారికి కావాల్సింది లభించింది. కేవలం మహేశ్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఫస్టాఫ్‌ మొత్తం ఎక్కడ బోర్‌ కొట్టకుండా సాగిందని, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదరిపోయిందని అంటున్నారు.  ముఖ్యంగా మహేశ్‌ లుక్స్‌ మార్వలెస్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రథమార్థంలో వచ్చే కశ్మీర్‌ అందాలు, మహేశ్‌ యాక్షన్‌ సీన్స్‌, ఆర్మీ నేపథ్యంలో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను కట్టిపడేసినటేకల అందరూ చెబుతున్నారు. ఇక సుదీర్ఘంగా సాగిన ట్రైన్‌ ఎపిసోడ్‌ పిచ్చెక్కించిందని కామెంట్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ రష్మిక మందన అండ్‌ గ్యాంగ్‌తో పాటు బండ్ల గణేశ్‌ ట్రైన్‌ ఎపిసోడ్‌లో చేసే కామెడీ సూపరో సూపర్‌ అంటున్నారు. 

‘ఒక్క మూడు నెలలు  అర్మీలో పని చేస్తే నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది’, ‘దేశం విలువ మీరు పడిపోయే రూపాయిలో చూస్తారు.. నేను ఎగిరే జెండాలో చూస్తాను’ అని రచయిత అందించిన మాటలు రోమాలు నిక్క బొడిచేలా ఉన్నాయని అంటున్నారు. ఇక ఫస్టాఫ్‌ సరద సరదాగా సాగిపోగా.. సెకండాఫ్‌లో అసలు యాక్షన్‌ పార్ట్‌ మొదలవుతుందని చెబుతున్నారు. సెకండాఫ్‌లో ప్రకాష్‌ రాజ్‌, విజయశాంతి, మహేశ్‌ బాబుల మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఎక్కడికో తీసుకపోతుందని పేర్కొంటున్నారు. ఇక యాక్షన్‌​ సీన్స్‌ను ఫైట్‌ మాస్టర్‌ రామ్‌-లక్ష్మణ్‌లు కొత్తగా కంపోజ్‌ చేశారని, మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ కైతే ఆడియన్స్‌ సీట్లలో ఎవరూ కూర్చోలేదని ఎగిరి గంతేశారని, అదేవిధంగా ఈ పాటలో మహేశ్‌ వేసిన మాస్‌ స్టెప్స్‌ అదరహో అన్నట్టు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు పబ్లిక్‌ టాక్‌, ట్విటర్‌ రివ్యూల ప్రకారం పండగకు ‘సరిలేరు నీకెవ్వరు’ బొమ్మ దద్దరిల్లడం పక్కా అని తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top