శివకార్తికేయన్‌తో మూడోసారి

keerthy suresh In Siva Karthikeyan Movie Seema Raja - Sakshi

తమిళ సినిమా: శివకార్తికేయన్, కీర్తీసురేశ్‌లది హింట్‌ పెయిరే కాదు సూపర్‌హిట్‌ పెయిర్‌. ఇంతకు ముందు ఈ జంట కలిసి నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. నటి కీర్తీసురేశ్‌ తాజాగా మూడోసారి శివకార్తికేయన్‌తో నటించడానికి సిద్ధమైంది. అంతే కాదు నటి సమంతతో కలిసి రెండోసారి కలిసి నటించనుంది. శివకార్తికేయన్‌ హీరోగా వరుత్తపడాద వాలిబన్, రజనీమురుగన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పొన్‌రామ్‌ తాజాగా ఆయనతో రూపొందిస్తున్న చిత్రం సీమరాజా. ఇంతకు ముందు రజనీమురుగన్, రెమో వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన 24 ఏఎం.స్టూడియోస్‌ సంస్థ అధినేత ఆర్‌డీ.

రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి సమంత కథానాయకిగా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో నటి సిమ్రాన్, సూరి, నెపోలియన్, లాల్, రాజేంద్రన్, మనోబాలా, యోగిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీసురేశ్‌ అతిథి పాత్రలో నటించనున్నట్లు చిత్ర నిర్మాత అధికారపూర్వకంగా వెల్లడించారు. అదే విధంగా సీమరాజా చిత్రంలో తానూ ఒక భాగం కానుండడం ఘనతగా భావిస్తున్నట్లు నటి కీర్తీసురేశ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన నడిగైయార్‌ తిలగం చిత్రంలో సావిత్రిగా నటించి ప్రశంసలు అందుకున్న కీర్తీసురేశ్‌కు తెలుగులో పలు అవకాశాలు వస్తున్నా అంగీకరించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీర్తీసురేశ్‌ ప్రస్తుతం తమిళంలో స్టార్‌ హీరోలు విజయ్‌తో ఆయన 62వ చిత్రంలోనూ, విశాల్‌కు జంటగా సండైకోళి–2, విక్రమ్‌ సరసనస్వామి స్క్వేర్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో శివకార్తికేయన్‌ చిత్రంలో అతిథి పాత్రకు అంగీకరించడం అందరినీ అశ్చర్యంలో ముంచెత్తుతున్న విషయం. కాగా సీమరాజా చిత్రం ప్రస్తుతం తెన్‌కాశీ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రాన్ని వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 13 విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top