నంబర్ వన్ ‘నయన్‌’

india today best actress of Tamil Nadu poll - Sakshi

సౌత్‌ ఇండియాలో అందాల తార నయనతార అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌ ల లిస్ట్‌ లోనూ టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. సీనియర్‌ హీరోయిన్‌ అయినా..కొత్త హీరోయిన్‌లతో పోటీపడుతూ.. ఇండియా టుడే పోల్‌లో మొదటిస్థానంలో నిలిచింది. కోలీవుడ్‌లో చేసిన ఈ సర్వేలో 21శాతం ఓట్లతో మొదటిస్థానాన్ని దక్కించుకుంది. ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ (తెలుగులో నేను రౌడీనే) సినిమాలో నయన్‌ నటనకు ముగ్ధులైన ప్రేక్షకులు ఆమెకు ఫస్ట్‌ ప్లేస్‌ కట్టబెట్టారు. తన నటన, తెరపై కనిపించే తీరు, ఒంటి చేత్తో సినిమాను నడిపించే సత్తా ఉండడం అన్నీ కలిసి ఆమెను నంబర్‌ వన్ గా నిలబెట్టాయి. చిరం‍జీవి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లోనూ నయన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఈ పోల్‌లో 9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. సౌత్‌ ఇండస్ట్రీలో ప్రయోగాలకి అనుష్క అరుంధతి లాంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు క్రేజ్‌ తీసుకొచ్చింది. త్వరలో ‘భాగమతి’ సినిమాతో అభిమానులను అలరించబోతోంది స్వీటీ. తరువాత 8 శాతం ఓట్లతో సమంత, ఓవియా, కీర్తి సురేష్‌ లు ముగ్గురు మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది పెళ్లి కారణంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన సామ్‌, కాస్త వెనకబడింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌ లలో వరుస సినిమాలకు కమిట్‌ అవుతూ జోరు చూపిస్తోంది. ఈ నెల 26న రానున్న అభిమన్యుడు సినిమాలో రతిదేవిగా అలరించేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. 

ఓవియాకు హిట్ సినిమాలు లేకున్నా.. ఈ పోల్‌లో మూడో స్థానంలో నిలిచింది. బిగ్‌బాస్‌ షోతో వచ్చిన పాపులార్టీతో ఈ అమ్మడు కెరీర్‌ లాగించేస్తుంది. ప్రస్తుతం ఈ భామ రాఘవ లారెన్స్‌ తెరకెక్కిస్తున్న మునీ 4(కాంచన3)లో నటిస్తోంది. అందం, అమాయకత్వం రెండూ ఉన్న ముద్దుగుమ్మ కీర్తిసురేశ్‌ మూడో స్థానం సాధించింది. ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నటనకు స్కోప్‌ ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది కీర్తి. విజయ్, సూర్య, పవన్‌ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించిన ఈ భామ, ప్రస్తుతం మహానటి పేరుతో తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక్‌ లో హీరోయిన్‌గా నటిస్తోంది.

కోలీవుడ్ అందాల భామ హన్సిక  7శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో దక్కించుకుంది. కోలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తున్న ఈ భామ.. ఈ మధ్యే మాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేరళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన విలన్‌ సినిమాలో నటించింది. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సీనియర్‌ హీరోయిన్‌ త్రిష 6శాతం ఓట్లను సాధించింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు కావొస్తున్నా.. తనకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. 

గత సంవత్సరం తన సినిమాలేవీ విడుదల కాకపోయినా..ప్రేక్షకులకు తనపైన ఉన్న అభిమానం ఏ మాత్రం చెక్కుచెదరలేదని ప్రూవ్‌ చేసుకుంది. తన సినిమాలు 2018లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వివాదాలతో వార్తల్లో నిలిచిన అమలాపాల్‌, బాహుబలి బ్యూటీ తమన్నా 5శాతం ఓట్లు సాధించారు. సీనియర్‌ హీరోలతో సినిమాలు చేస్తూ అలరిస్తున్న కాజల్‌, శృతిహాసన్‌లు 4 శాతం ఓట్లతో 6వ స్థానంలో ఉన్నారు. కొసమెరుపు ఏంటంటే...13 శాతం మంది తమిళులు బెస్ట్ హీరోయిన్‌గా లిస్ట్ లో ఉన్న ఎవరినీ ఎంపిక చేయలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top