
అఖిల్కి నా రేటింగ్ ఐదుకి ఐదు! - నాగార్జున
‘‘అఖిల్ నా కొడుకు అయిపోయాడు కాబట్టి, నేను పొగడలేక పోతున్నాను.
‘‘అఖిల్ నా కొడుకు అయిపోయాడు కాబట్టి, నేను పొగడలేక పోతున్నాను. వేరే హీరో అయితే మొహమాటపడకుండా పొగిడేవాణ్ణి. మొన్నా మధ్య ‘కంచె’ సినిమా చూశాను. నాగబాబుగారి అబ్బాయి వరుణ్ అద్భుతంగా నటించాడు. చాలా కష్టపడి చేశాడు’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్ని హీరోగా పరిచయం చేస్తూ, హీరో నితిన్ నిర్మించిన ‘అఖిల్’ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్లో ఈ చిత్రం విజయోత్సవం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ - ‘‘మామూలుగా మీడియావాళ్లు రేటింగ్స్ ఇస్తుంటారు కదా. నన్ను కనుక అఖిల్కి రేటింగ్ ఇవ్వమంటే తన నటనకి ఐదుకి ఐదు ఇస్తాను. మొదటి సినిమాకే అంత కష్టపడటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా విషయంలో నేనూ, అఖిల్ తిట్టుకున్నామని మీడియాలో కొందరు అనుకుంటున్నారు. అసలు మా ఫ్యామిలీలో ఆ కల్చరే లేదు. మా కుటుంబం గురించి తెలిసినవాళ్లకి ఆ విషయం తెలుసు. అయినా ఈ రోజుల్లో కూడా తిట్టుకోవడం ఏంటి? అఖిల్, చైతన్యలను ‘మీకు కోపమే రాదా’ అని అడుగుతుంటాను. మా మధ్య సంభాషణ అంత కూల్గా ఉంటుంది. వినాయక్గారు బి, సీ సెంటర్స్ అభిమానులందర్నీ థియేటర్కి రప్పించగలిగారు. ఒక మాస్ హీరోకి వచ్చినంత రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. అమల చాలా ఆనందంగా ఉంది.
నితిన్, సుధాకర్రెడ్డి రాజీపడకుండా నిర్మించారు. నేను చేసిన 30 సెకన్ల సీన్కి మంచి అప్లాజ్ వచ్చింది. అభిమానులందరూ నన్నూ, అఖిల్నీ ఒకేసారి తెర పై చూసి ఆనందానికి లోనయ్యారు’’ అని చెప్పారు. వినాయక్ మాట్లాడుతూ - ‘‘నా సినిమాలో మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇది. అఖిల్ నటనకు థియేటర్లలో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు’’ అని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ - ‘‘నేనింకా ట్రాన్స్లోనే ఉన్నాను. మొదటి సినిమా కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఇంత భారీ ఓపెనింగ్స్, వసూళ్లను అస్సలు ఊహించలేదు. అక్కినేని అభిమానుల వల్లే ఇది సాధ్యమైంది’’ అన్నారు. నితిన్ మాట్లాడుతూ - ‘‘అఖిల్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు. తమ్ముడిలాంటివాడు. అందుకే తను పెద్ద కమర్షియల్ హీరో కావాలన్నది నా ఆశ. ఒక హీరోని పెద్ద కమర్షియల్ హీరోగా ఆవిష్కరించడం వినాయక్గారికి బాగా తెలుసు. ఈ సినిమా మొదటి రోజు 10 కోట్లు షేర్ సాధించింది. నాకు తెలిసి ఇండియాలో ఏ కొత్త హీరో సినిమా ఇంత వసూళ్లు రాబట్టలేదు. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. మామూలుగా ఒక సినిమాకి డివైడ్ టాక్ వస్తే, మధ్యాహ్నం ఆటకే వసూళ్లు పడిపోతాయి. కానీ, ఈ సినిమా రెండో రోజు వసూళ్లు కూడా బాగున్నాయి’’ అని చెప్పారు. ఈ వేడుకలో సుధాకర్ రెడ్డి, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సాయేషా సైగల్ మాట్లాడారు.