గుణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

Guna 369 Movie Producers Press Meet - Sakshi

కార్తికేయ హీరోగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 2న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు పలు విశేషాలు పంచుకున్నారు.  ‘‘టీవీ సీరియల్స్‌. ఈవెంట్స్‌ చేసిన అనుభవం ఉంది. మంచి కథ కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. అర్జున్‌ జంధ్యాల మంచి స్క్రిప్ట్‌తో వచ్చాడు. ఏదో తీశాం అన్నట్టుగా కాకుండా స్క్రిప్ట్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌ నుంచి వర్క్‌ చేశాం.

అర్జున్‌ ఎలా అయితే కథను చెప్పాడో అలానే తీశాడు. కార్తికేయ చేసిన గత రెండు సినిమాలకు భిన్నంగా ఉంటుంది.  ఫుల్‌ ఎమోషన్స్‌తో నిండిన చిత్రమిది. ప్రొడక్షన్‌ విషయంలో సినిమా, సీరియల్‌ రెండూ ఒకటే. కాకపోతే స్కేల్‌ మారుతుంది. ఈ సినిమా తర్వాత మణిరత్నం దగ్గర వర్క్‌ చేసిన కిరణ్‌తో తదుపరి చిత్రం అనుకుంటున్నాం’’ అన్నారు తిరుమల్‌ రెడ్డి.  ‘‘టైటిల్‌లో 369 చూసి ‘ఆదిత్య 369’లా ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా అనుకోకూడదని ట్రైలర్‌లో కార్తికేయ ఖైదీ అని చూపించేశాం. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ, మంచి లవ్‌స్టోరీ ఇది. సామాజిక అంశాలున్న కమర్షియల్‌ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించాం.

సినిమాలో ఓ కీ పాయింట్‌ ఉంది. రివ్యూ రాసేవాళ్లు దాన్ని రివీల్‌ చేయొద్దని కోరుకుంటున్నాం. సినిమాలో యాక్షన్‌ కూడా ఎమోషన్‌తో ఉంటుంది’’ అన్నారు అనిల్‌ కడియాల. ‘‘ఆడపిల్లల తల్లిదండ్రులకు, బుద్ధిమంతులైన అబ్బాయిలున్న తల్లిదండ్రులకు ఈ కథ కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. టీవీలో వాడే ఫార్మట్‌నే ఇక్కడ కూడా వాడాం. పాత్రలకు మనం కనెక్ట్‌ అయితే సినిమాకి కనెక్ట్‌ అయిపోతాం. ‘గుణ’ అందరికీ కనెక్‌ట అవుతుంది. ఇద్దరు పార్టనర్స్‌ ఉంటే అభిప్రాయభేధాలు రావచ్చు. కానీ అవేమీ లేకుండా మా ప్రయాణం సాఫీగా సాగింది. ఇలానే కలసి పని చేస్తాం’’ అన్నారు ప్రవీణ కడియాల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top