Sakshi News home page

సాహిల్ సంగాతో దియా మీర్జా నిశ్చితార్థం

Published Wed, Apr 30 2014 2:01 PM

సాహిల్ సంగాతో దియా మీర్జా నిశ్చితార్థం - Sakshi

ఎంతోకాలంగా వార్తల్లో ఉన్న బాలీవుడ్ నటి దియా మీర్జా నిశ్చితార్థం చేసేసుకుంది. సుదీర్ఘంగా తన వ్యాపార భాగస్వామిగా ఉన్న సాహిల్ సంగాతోనే న్యూయార్క్ నగరంలో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని దియా మీర్జా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దియా మీర్జా.. ఇక్కడి స్టాన్లీ కాలేజిలో చదివింది. మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, తర్వాత బాలీవుడ్కు వెళ్లిన ఆమె, కొన్నాళ్ల క్రితం వరకు కునాల్ కపూర్తో కూడా తిరిగినట్లు వదంతులు వచ్చాయి.

చివరకు సంగాతోనే ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఫొటోతో సహా ఆమె ట్విట్టర్ ఖాతాలో పెట్టగానే అభిమానులు, స్నేహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. వీళ్లిద్దరూ అమెరికాలో జరుగుతున్న ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమం కోసం అక్కడకు వెళ్లారు. అక్కడే నిశ్చితార్థం చేసేసుకున్నారు. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి, విద్యాబాలన్తో 'బాబీ జాసూస్' చిత్రం కూడా నిర్మించారు.

Advertisement
Advertisement