ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

COVID-19: Author And singer  Daddy Srinivas song Launch - Sakshi

కరోనా మహమ్మారిపై ప్రపంచం చేస్తున్న యుద్ధంలో కళాకారులు తమ వంతు సాయం అందిస్తున్నారు. కొందరు విరాళాలు అందిస్తున్నారు, మరికొందరు స్ఫూర్తిదాయక మాటలతో, పాటలతో ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. రచయిత డాడీ శ్రీనివాస్‌ రాసిన ‘ఏయ్‌.. ఎత్తర.. ఎత్తర సోదర భారతదేశం జెండా.... కరోనా రక్కసి కోరలు పీకే అశోకచక్రం జెండా’ పాట బుధవారం విడుదలైంది. రాజేష్‌ పాడారు. ‘కనపడే శత్రువు దండెత్తి వస్తే ధైర్యంగా యుద్ధం చేస్తాం. కనిపించని ఈ మహమ్మారిని ఒంటరిని చేద్దాం. ఇంట్లో ఉండి కరోనాపై యుద్ధం ప్రకటిద్దాం. మన దేశం దాటిద్దాం’ అని సాగే ఈ పాట గురించి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఈ పాట  ట్యూన్‌ కూడా నాదే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లోకి వచ్చి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించలేం.

అందుకే ఇంట్లో ఉండి పాట ద్వారా ప్రజలను చైతన్యపరచవచ్చు అనిపించింది. కరోనాపై మరో పాట కూడా రాశాను. ఇంకా రికార్డ్‌ చేయాల్సి ఉంది. అలాగే ప్రధాని మోదీగారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌గారు, కేసీఆర్‌గారు ఇచ్చే మార్గదర్శకాలను అందరం ఫాలో అవుదాం. కరోనాను తరిమేద్దాం’’ అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ– ‘‘డాడీ’, ‘సీమసింహం’, ‘చెన్నకేశవరెడ్డి’... ఇలా 350కి చిత్రాలకు పైగా పాటలు రాశాను. జగన్‌గారి ఓదార్పు యాత్రకు సంబంధించిన పాటలు రాశాను. నేను దర్శకత్వం వహించిన ‘మట్టిలో మాణిక్యాలు’ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. మరో సినిమాకు దర్శకత్వం వహించే కార్యక్రమాల్లో ఉన్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top