
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయం అందించడానికి ప్రముఖ హీరో రామ్చరణ్ ముందుకొచ్చారు. ఈ సంక్షోభ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో రూ. 70 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు చెప్పారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లు చేస్తున్న కృషి అభినందనీయమైనదన్నారు. కరోనా నివారణను వారు తీసుకుంటున్న చర్యలకు ఒక బాధ్యత గత పౌరునిగా మద్దతు తెలుపడమే కాకుండా వాటిని పాటిస్తానని చెప్పారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమై.. సురక్షితంగా ఉంగాలని ఆకాంక్షించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో రామ్చరణ్ తన వంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 649, తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ట్విటర్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్చరణ్..
ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అకౌంట్లు కలిగిన రామ్చరణ్.. గురువారం ట్విటర్లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్ ఖాతాను ప్రారంభించన రామ్చరణ్.. తొలి ట్విట్లోనే కరోనాపై పోరాటానికి విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ట్విటర్ ఖాతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విటర్లోకి అడుగుపెట్టిన రామ్చరణ్కు పలువురు సెలబ్రిటీలు విషెస్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.
చదవండి : రౌద్రం రణం రుధిరం
కరోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం