కోర్టులో నటి ట్వింకిల్ ఖన్నాకు ఊరట | Bombay High Court stays order on Rajesh Khanna's will copy | Sakshi
Sakshi News home page

కోర్టులో నటి ట్వింకిల్ ఖన్నాకు ఊరట

Aug 4 2014 7:13 PM | Updated on Apr 3 2019 6:23 PM

కోర్టులో నటి ట్వింకిల్ ఖన్నాకు ఊరట - Sakshi

కోర్టులో నటి ట్వింకిల్ ఖన్నాకు ఊరట

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నాకు ముంబై హైకోర్టులో ఊరట లభించింది.

ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నాకు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ట్వింకిల్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా రాయించిన వీలునామా కాపీని ఆయన సహచరి అనితా అద్వానీకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది.

సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ ట్వింకిల్ చేసిన అప్పీలును హైకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ మోహిత్ షా సారథ్యంలోని ధర్మాసనం.. కేసు విచారణ ముగిసే వరకు గత తీర్పుపై  స్టే విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అనిత రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యురాలు లేదా వారసురాలు కాదని, ఆమెకు వీలు కాపీ ఇవ్వాల్సిన అవసరం ట్వింకిల్కు లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. రాజేష్ ఖన్నా తన వారసురాళ్లుగా కుమార్తెలు ట్వింకిల్, రింకీ పేర్లను వీలులో రాశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలావుండగా, ఆయన నివసించిన బంగ్లాను ఇటీవల ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. 2012లో రాజేష్ ఖన్నా మరణించారు. రాజేష్ ఖన్నాతో విభేదాల కారణంగా ఆయన భార్య, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా తన పిల్లలతో కలసి వేరుగా ఉండేవారు. అప్పట్లో రాజేష్ అనితతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో అనితకు, రాజేష్ ఖన్నా కుమార్తెలకు మధ్య ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement