ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది

AR Rahman turns co-producer and composer for Nawazuddin Siddiqui - Sakshi

ఏఆర్‌ రెహమాన్‌ మరో సినిమా నిర్మించనున్నారు. ఆల్రెడీ ‘99 సాంగ్స్‌’ చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ అనే చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది యూఎస్‌–ఇండియా–బంగ్లాదేశ్‌ సినిమా. జాతిపరంగా విభజించబడిన ఈ ప్రపంచంలోని హానికర వ్యక్తులపై ఫోకస్‌ చేస్తూ సాగే చిత్రం ఇది. ఈ సినిమా నిర్మించాలనుకోవడానికి గల ముఖ్య కారణం గురించి రెహమాన్‌ చెబుతూ – ‘‘కొత్త ప్రపంచంలో ఎప్పుడూ కొత్త సవాళ్లు ఉంటాయి. అందుకని కొత్త కథలు చెప్పడానికి కుదురుతుంది. ఈ చిత్రకథ అలాంటిదే. ఇప్పటి ప్రపంచానికి చెప్పాల్సిన కథ, ఇప్పటి సమయానికి తగ్గ కథ ఇది’’ అన్నారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హిందీ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా నాకు ఓ సవాల్‌లా అనిపించింది. అయినప్పటికీ నటుడిగా సంతృప్తినిచ్చింది. ఏఆర్‌ రెహమాన్‌ ప్రతిభ ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ని గొప్ప సినిమాగా నిలబెడుతుంది’’ అన్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే... దక్షిణాసియాకి చెందిన ఓ వ్యక్తి జీవితం యూఎస్‌లో ఓ ఆస్ట్రేలియన్‌ యువతిని కలిశాక ఎంత సంక్లిష్టంగా మారిందనేది కథ. ఆసిఫ్‌ మాండ్వి రాసిన ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం.   హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో సంభాషణలు ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలను యూ ఎస్, ఇండియా, బంగ్లాదేశ్‌లో జరపాలనుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆ పనులు ఆగాయి. బంగ్లాదేశ్‌ దర్శకుడు మొస్తోఫా సర్వార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top