ఆ సినిమాకు రూ.100 కోట్లు డిమాండ్‌ చేశాడా?! | Akshay Kumar Sources Demands More Than Rs.100 Crore For His New Movie | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు అక్కీ రూ.100 కోట్లు డిమాండ్‌ చేశాడా?!

Jan 22 2020 5:31 PM | Updated on Jan 22 2020 6:31 PM

Akshay Kumar Sources Demands More Than Rs.100 Crore For His New Movie - Sakshi

బాలీవుడ్‌ ‘కిలాడి’ అక్షయ్‌ కుమార్‌ తన తాజా చిత్రం కోసం నిర్మాత వద్ద పారితోషికం భారీగానే డిమాండ్‌ చేశాడనే వార్తలు బాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసిన అత్యధిక ధనార్జన నటుల జాబితాలో అక్షయ్‌ 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో సౌత్‌ స్టార్‌ హీరో ధనుష్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌లతో పాటు అక్షయ్‌ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇందుకోసం దర్శకుడు ఆనంద్‌, అక్షయ్‌ బృందాన్ని సంప్రదించగా వారు రూ.100 కోట్లకు పైనే డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం అక్షయ్‌కు పెరిగిన క్రేజ్‌, అక్కీ నటించిన తాజా చిత్రాలు బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుండటంతో అంత భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక నటన పరంగా కూడా అక్కీ.. వంద కోట్లకు మించిన పారితోషికానికి అర్హుడని సన్నిహితవర్గాలు అభిప్రాయపడుతున్నట్లు ఓ న్యూస్‌ ఛానెల్‌ పేర్కొంది. కాగా .. ‘గుడ్‌న్యూస్‌’, ‘హౌస్‌ఫుల్‌’ వంటి కామెడి డ్రామాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్షయ్‌ను.. కొన్ని వెబ్‌ సిరీస్‌, సాటిలైట్‌ ఛానెల్‌లు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం అక్షయ్‌ అడ్వాన్స్‌ కూడా తీసుకుంటున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇక అక్షయ్‌ తాజా నటించిన గుడ్‌న్యూస్‌ చిత్రం గత డిసెంబర్‌ విడుదలై బీ-టౌన్‌ బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన నటించిన హౌస్‌ఫుల్‌ 4, మిషన్‌ మంగళ్‌ బ్లాక్‌బస్టర్లుగా నిలవడంతో ‘కిలాడి’  క్రేజ్‌ మరింత పెరిగిందని చెప్పవచ్చు. కాగా 2019లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన టాప్‌ 10 అత్యధిక ఆర్జన గల నటుల జాబితాలో అక్షయ్‌ 4వ స్థానంలో నిలవగా ద్వాయానె జాన్సన్‌, క్రిస్‌ హెమ్సన్‌వర్త్‌, రాబర్ట్‌ డౌనే 1,2, 3 స్థానాలు పొందిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement