బాలీవుడ్‌లో మరో విషాదం

Actor Singer Divya Chouksey Dies Due to Cancer   - Sakshi

సాక్షి, ముంబై:  బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో  పోరాడుతున్న ఆమె  ఆదివారం తుది శ్వాస విడిచారు. 'సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన దివ్య బంధువు సౌమ్యా అమిష్‌ వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత)

దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తనను తాను క్యాన్సర్ సర్వైవర్‌గా గర్వంగా చెప్పుకున్న దివ్య చివరికి ప్రాణాంతక వ్యాధికి తలవంచక తప్పలేదంటూ ఆమె అభిమానులు నివాళులర్పించారు. మరణానికి కొన్ని గంటల ముందు దివ్య చోక్సీ సోషల్‌ మీడియాలో హృదయాన్ని మెలిపెట్టే పోస్టుతో ఈ  ప్రపంచానికి గుడ్‌బై చెప్పడం మరింత  విషాదం. సుదీర్ఘ కాలం క్యాన్సర్‌తో బాధపడుతూ నెలల తరబడి  మరణశయ్యపై ఉన్నాను. బాధ లేని మరో జన్మలో కలుద్దాం...సెలవంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో తుది వీడ్కోలు తీసుకున్నారు.  (పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!)

నవంబరు 14, 1990లో దివ్య  జన్మించారు. దివ్య తండ్రి మోహన్‌ చోక్సీ  ప్రముఖ న్యాయవాది, కాగా  సోదరి పల్లవి, సోదరుడు మయాంక్‌ కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు.

2011 సంవత్సరంలో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్నారు. 2016 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫేమ్ సాహిల్ ఆనంద్‌తో కలిసి హై అప్పా దిల్ తోహ్ అవారా సినిమాలో నటించిన ఆమె పలు యాడ్ సినిమాలు, టెలివిజన్ షోలలో కూడా నటించారు.  ‘పాటియలే డి క్వీన్’ తో  సాంగ్‌తో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్,  సీనియర్‌ హీరో రిషికపూర్‌  మరణంతోపాటు ఇటీవల బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్యతో కలవర పడిన బాలీవుడ్‌ను గత కొన్నిరోజులుగా  వరుస విషాదాలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top