చిలుమూరు గుడిలో హీరో రాజేంద్రప్రసాద్‌ పూజలు

సాక్షి, కొల్లూరు: ప్రముఖ సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ కృష్ణా తీరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన గుంటూరుజిల్లా చిలుమూరులోని ఉభయ రామలింగేశ్వర క్షేత్రాన్నిఆదివారం ఉదయం తన కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భార్య, కుమారుడు, కోడలితో కలిసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. గోశాలను సందర్శించి గోపూజ చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో పల్లె వాతావరణాన్ని ఆస్వాదించిన రాజేంద్రుడు తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో కలిసి నెమరువేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ వస్తున్నట్లు తెలుసుకుని ఆయన్ను కలవడానికి వచ్చిన స్థానికులను చిరునవ్వుతో పలకరిస్తూ ఫొటోలు దిగారు. కొల్లూరు ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్‌ మైనేని మురళీకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు క్రోసూరు అప్పయ్య, సర్పంచ్‌ మొలబంటి రామారావు తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top