సాగునీరు అందేదెట్టా..? | Sakshi
Sakshi News home page

సాగునీరు అందేదెట్టా..?

Published Mon, Feb 5 2018 5:15 PM

farmers will face problems by using check dam water for mission kakatiya works - Sakshi

కారేపల్లి : కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లుంది.. కోటిలింగాల చెక్‌డ్యాం ఆయకట్టు రైతుల పరిస్థితి. మిషన్‌ కాకతీయ పనులతో చెక్‌డ్యాంకు మరమ్మతులు చేస్తున్నారని, వాగులో ఉన్న పూడికను తొలగిస్తున్నారని ఆనందపడాలో.. లేక ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వేసుకున్న పొలాలు, మిర్చి తోటలు ఎండిపోతాయని బాధపడాలో.. అర్థం కాని పరిస్థితుల్లో ఆయకట్టు రైతులు ఉండిపోయారు. వివరాల్లోకి వెళ్లితే..

మండలంలోని పేరుపల్లి, ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న బుగ్గవాగుపై కోటిలింగాల దేవాలయం వద్ద చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం ఆయకట్టులో సుమారు 100 ఎకరాల్లో బుగ్గవాగు నీటిని వినియోగించుకుంటున్నారు. మిర్చి తోటలు, వరి పంట లను సాగు చేస్తున్నారు. పేరుపల్లి రైతులతోపాటు, జమాళ్లపల్లి, పోలంపల్లి, దుబ్బతండా, మోకాళ్లవారి గుంపు, పోలంపల్లి గేటుతండా గ్రామాలకు చెందిన సుమారు 45 మంది రైతులు.. బుగ్గవాగులో నీరు సంవృద్ధిగా ఉండటంతో ఈ ఏడాది రబీలో వరి సాగు చేస్తున్నారు. అయితే మిషన్‌ కాకతీయలో చెక్‌డ్యాం మరమ్మలకు రూ.37.44లక్షలు మంజూరు అయ్యాయి.

ఇదిలా ఉండగా మరమ్మతులు చేపట్టాలంటే.. బుగ్గవాగులో నీటిని తొలగించాల్సి ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చెక్‌డ్యాం వద్ద తూమ్‌ గేట్లను పగలకొట్టి బుగ్గవాగు నీళ్లను ఖాళీ చేస్తున్నారని ఆయకట్టు రైతులు ధరావత్‌ గోపాల్, వర్స రామయ్య, మాలోతు శంకర్, గుగులోతు బాల, వాంకుడోతు హర్‌జ్య, ఈసం ఎర్రయ్య చెబుతున్నారు. డీజిల్‌ ఇంజన్‌లతో పంటలకు కాపాడుకుంటున్నామని, వాగు నీళ్లను ఖాళీ చేస్తే తీవ్రంగా నష్ట పోతామంటున్నారు. దీనికి అధికారులే ప్రత్యామ్నాయం చూపాలని, లేదంటే పైర్లు నాశనం అవుతాయని మొరపెట్టుకుంటున్నారు.  

పంటలు ఎండిపోక తప్పదు..  
మరమ్మతుల పేరుతో బుగ్గవాగు నీళ్లు ఖాళీ చేస్తే పంటలు ఎండిపోక తప్పదు. మా కుటుంబం వీధిన పడుతుంది. నాకున్న 3 ఎకరాల్లో వరి పంట, ఎకరంలో మిర్చి సాగు చేశా. వీటికి బుగ్గవాగు నీళ్లే దిక్కు. పెద్ద సార్లు ఆలోచించి పైర్లు ఎండిపోకుండా చూడాలి.  
– ధరావత్‌ గోపాల్, పోలంపల్లి  

1/1

డీజిల్‌ ఇంజన్‌తో నీటిని తోడుతున్న దృశ్యం

Advertisement
Advertisement