భారత్‌ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా | US Official Says 1300 Americans Return Home From India Covid 19 Lockdown | Sakshi
Sakshi News home page

వారందరినీ స్వదేశానికి తీసుకువచ్చాం: అమెరికా

Apr 7 2020 3:05 PM | Updated on Apr 7 2020 5:58 PM

US Official Says 1300 Americans Return Home From India Covid 19 Lockdown - Sakshi

అలిస్‌ వెల్స్‌(ఫైల్‌ ఫొటో)

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 2900 మంది అమెరికన్లను స్వదేశానికి తీసుకువచ్చామని అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ పేర్కొన్నారు. 13 ప్రత్యే విమానాల ద్వారా వీరందరినీ తరలించినట్లు పేర్కొన్నారు. ‘‘ఈరోజు వరకు దక్షిణ-మధ్య ఆసియా దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఉజ్బెకిస్తాన్‌, టర్కిమినిస్తాన్‌ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా మా పౌరులను తీసుకువచ్చాం’’అని ఆమె పేర్కొన్నారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌)

ఇక భారత స్థానిక అధికారులతో అమెరికా ప్రభుత్వ వర్గాలు సమన్వయం చేసుకుంటూ అక్కడ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 1300 మందిని అమెరికాకు తీసుకువచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో చిక్కుకుపోయిన అమెరికన్లను తరలించడంలో భారత్‌ సహాయం అందించిందని పేర్కొన్నారు. ఇదంతా బృంద స్ఫూర్తితోనే సాధ్యమైందన్నారు. ఇక మలేరియా యాంటీ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుల విషయమై తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై వెల్స్‌ పరోక్షంగా స్పందించారు. ‘‘మా పౌరులను వెనక్కి తీసుకురావడానికి దక్షిణాసియా దేశాలు చేసిన సహాయానికి కృతజ్ఞులం. మాకు సహకరించిన స్థానిక, ప్రాంతీయ, ఆరోగ్య అధికారులు, చట్ట సంస్థలు, పౌర విమానయాన శాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు.

అదే విధంగా అంటువ్యాధిని అరికట్టేందుకు భారత్‌- అమెరికా పరస్పరం సహకరించుకోవాలి. చాలా ఏళ్లుగా ఫార్మాసుటికల్‌ రంగంలో భారత్‌ అమెరికాకు భాగస్వామిగా ఉంది. అంతేకాదు జనరిక్‌ డ్రగ్స్‌ సరఫరా చేయడంలో భారత్‌ అగ్రగామిగా ఉంది. వాళ్లు అమెరికా మార్కెట్లోకి యాంటీ మలేరియా డ్రగ్‌ సరఫరా చేస్తారనే నమ్మకం ఉంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కరోనాను కట్టడి చేయడంలో సత్పలితాలు సాధిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల సరఫరా నిలిపివేసినట్లయితే భారత్‌పై వాణిజ్యపరంగా ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత్‌.. మహమ్మారితో తీవ్రంగా నష్టపోతున్న దేశాలకు అత్యవసరమైన మందులను ఎగుమతి చేస్తామని ప్రకటించింది.(అమెరికాలో మరింత తీవ్రం!)

ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్‌

Advertisement
 
Advertisement
Advertisement