పుల్వామా దాడి నీచం, హేయం | UNSC Condemns Pulwama Terror Attack In India | Sakshi
Sakshi News home page

పుల్వామా దాడి నీచం, హేయం

Feb 23 2019 7:51 AM | Updated on Feb 23 2019 7:51 AM

UNSC Condemns Pulwama Terror Attack In India - Sakshi

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగం (యూఎన్‌ఎస్సీ) శుక్రవారం తీవ్రంగా ఖండించింది. దాడిని క్రూరమైన, పిరికిపందల చర్యగా అభివర్ణించింది. భారత్‌ వాదనకు మద్దతుగా.. పాకిస్థాన్‌ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించినట్లు కూడా తీర్మానంలో పేర్కొంది. దోషుల్ని చట్టం ముందుకు తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి అన్ని దేశాలూ భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

కాగా భారత్‌కు చెందిన కశ్మీర్‌ అని కాకుండా ‘భారత్‌ అధీనంలోని కశ్మీర్‌’ అని ప్రకటనలో పేర్కొనాలని ఈ సందర్భంగా చైనా సూచించనట్లు సమాచారం. అయినప్పటికీ చైనా అభ్యంతరాలను తోసిపుచ్చి భారత్‌ ప్రతిపాదించిన ప్రకటనకే మండలి మొగ్గుచూపడం విశేషం. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ స్థాపకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి చైనా మోకాలడ్డుతుండడం తెలిసిందే. త్వరలో మరోసారి అజార్‌ అంశాన్ని ఫ్రాన్స్‌ మండలిలో ప్రవేశపెట్టనుంది.

Advertisement
 
Advertisement
Advertisement