
తుపాకి చిహ్నం సృష్టికర్త ఇక లేరు!
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు ప్రతిష్టించిన 'తుపాకి కాంస్య విగ్రహం' సృష్టికర్త, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్వీడన్ శిల్పి కార్ల్ ఫ్రెడ్రిక్ రాయిటర్స్ వార్డ్ ఇక లేరు.
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు ప్రతిష్టించిన 'తుపాకి కాంస్య విగ్రహం' సృష్టికర్త, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్వీడన్ శిల్పి కార్ల్ ఫ్రెడ్రిక్ రాయిటర్స్ వార్డ్ ఇక లేరు. ఆయన సోమవారం కన్ను మూసినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయనకు 81 ఏళ్లు. ఫ్రెడ్రిక్ తన స్నేహితుడైన గాయకుడు, శాంతి కార్యకర్త జాన్ లెనాన్కు నివాళిగా ఈ తుపాకి కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. అది గొట్టం చివర ముడివేసినట్టు ఉంటుంది. 1980లో లెనాన్ను కాల్చి చంపినందుకు తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా, అహింసకు చిహ్నంగా ఈ విగ్రహాన్ని ఫెడ్రిక్ చెక్కారు.
ముందుగా ఈ విగ్రహాన్ని న్యూయార్క్ సెంట్రల్ పార్క్లోని స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ మెమోరియల్ హాల్లో ప్రతిష్టించారు. లెనాన్ ఆ ప్రాంతంలోనే నివసించడంతో ఆయనకు గుర్తుగా దాన్ని అక్కడ ప్రతిష్టించారు. ఆ తర్వాత లగ్జంబర్గ్ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఐక్యరాజ్య సమితికి బహూకరించింది. ఈ చిహ్నానికి ఎంతో ప్రాముఖ్యత లభించడంతో ప్రపంచవ్యాప్తంగా చిహ్నం నమూనాలను 30 రూపొందించారు. వాటిలో పది చిహ్నాలు స్వీడన్లోనే ఉన్నాయి. పారిస్లో చదువుకున్న ఫ్రెడ్రిక్ స్టాక్హోమ్లోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన తన శిల్పాలను పలు దేశాల్లో ప్రదర్శించారు. 'ఎట్ ది సేమ్ టైమ్' పేరిట ఆయన కవితల సంకలనాన్ని కూడా ప్రచురించారు.