
‘మేకిన్ ఇండియా’.. ఒక ఉద్యమం
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జర్మనీ చేరుకున్నారు.
జర్మనీ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
⇒ ఫ్రాన్స్తో చర్చలపై సంతృప్తి
⇒ హోలాండ్కు భారతీయ పెయింటింగ్ బహూకరణ
హనోవర్: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జర్మనీ చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్తో విస్తృత చర్చల అనంతరం ఆయన జర్మనీలో అడుగుపెట్టారు. హనోవర్లో జరిగిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘మేకిన్ ఇండియా’ (భారత్లో తయారీ) ఒక జాతీయ ఉద్యమమని, దీంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
భారత్ను పారిశ్రామిక కేంద్రంగా మార్చేం దుకు జర్మనీ సహకరించాలని కోరారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో జర్మనీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మోదీ కృషి చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్తో పాటు జర్మన్ వ్యాపార వర్గాలతో మోదీ చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంపు, టెక్నాలజీ మార్పిడిపై ప్రధాని దృష్టి సారిస్తారు.
ఫ్రాన్స్లో విద్యార్థులకు మరింత గడువు
ఇకపై ఫ్రాన్స్లో చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు మరికొంత కాలం అక్కడే ఉండవచ్చు. ఫ్రెంచ్ విద్యార్థులు కూడా భారత్లో ఇలాగే ఉండొచ్చు. ఈ మేరకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఇరు దేశాల్లో 12 నెలల కాలం పూర్తి చేసుకున్న విద్యార్థుల వీసా గడువును మరో 12 నెలలు పొడిగిస్తారు. జర్మనీకి వెళ్లే ముందు ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్తో కల సి మోదీ ప్రకటన జారీ చేశారు.
ఇరు దేశాల మధ్య బంధాన్ని దృఢం చేసుకునే దిశగా జరిగిన చర్చలపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంస్కృతిని పరస్పరం అర్థం చేసుకునేలా విద్యార్థులకు వీసా గడువు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, వీడ్కోలు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఓ అద్భుత పెయింటింగ్ను బహూకరించారు. ‘ట్రీ ఆఫ్ లైఫ్’గా పిలిచే ఈ చిత్రాన్ని ఒడిశాకు చెందిన ప్రఖ్యాత కళాకారుడు భాస్కర్ మహాపాత్ర వేసినట్లు అధికారులు తెలిపారు.
ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మోదీ ప్రసంగం
ఫ్రాన్స్లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్యారిస్లో ఇక శనివారం రాత్రి మోదీ ప్రసంగించారు. దేశంలో మూడున్నర లక్షల మంది సంపన్నులు సబ్సిడీ గ్యాస్ను వదులుకున్నారని, ఈ రకంగా మిగిలే నిధులను పేదలకు గ్యాస్ అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. దేశంలోని పేదలందరికీ బ్యాంకు ఖాతాలు తెరవాలన్న లక్ష్యం పెట్టుకున్నామని, భారత్ ఇకపై పేద దేశంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఈ సందర్భంగా బొగ్గు స్కాంను ప్రస్తావించారు.
బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో గత యూపీఏ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 204 బొగ్గు బ్లాకుల్లో కేవలం 20 బ్లాకుల వేలానికే రూ. రెండు లక్షల కోట్లు వచ్చాయన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు చెబుతున్నాయని, ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.
హనోవర్లో గాంధీ విగ్రహావిష్కరణ
జర్మనీలోని హనోవర్లో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. మహాత్ముడి బోధనలు, విధానాలు ఉగ్రవాదం, భూతాపోన్నతి వంటి సవాళ్లకు తగిన సమాధానాలని అన్నారు. మూడు రోజుల పర్యటన కోసం జర్మనీకి వచ్చిన మోదీ మొదటిరోజైన ఆదివారం హనోవర్లో పర్యటించారు.
‘మండలి’లో శాశ్వత సభ్యత్వం భారత హక్కు
ప్రపంచశాంతి కోసం మొదటి ప్రపంచయుద్ధం నుంచీ భారత్ ఎన్నో త్యాగాలు చేసిందని, ఇప్పటికీ శాంతి పరిరక్షకదళంలో అతిపెద్ద భాగస్వామిగా ఉందని మోదీ తెలిపారు. ప్రపంచదేశాలు దీన్ని గౌరవించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఇకపై ఇందుకోసం భారత్ వేడుకోబోదని, అది తమ దేశహక్కని చెప్పారు. ఈ ఏడాది 70వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఐరాస ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు.
లక్షలాది భారత సైనికులు ప్రపంచ శాంతి కోసం యుద్ధాల్లో పాల్గొన్నారని, ఇతర దేశాల కోసం ప్రాణాలొదిలారని, భారత్ అంటేనే త్యాగాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ను వీడుతున్న సందర్భంగా ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్లో తన పర్యటన విజయవంతమైందంటూ ఇంగ్లిష్, ఫ్రెంచ్లో ట్వీట్ చేశారు.