సాక్షి హైదరాబాద్ : మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ రాష్ట్రంలో నిరసనలు తీవ్రతరం చేస్తోంది. ఇది వరకే ఈ పేరు తొలగింపుపై పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలని యోచిస్తుంది. ఈ నెల 28న ప్రతి గ్రామంలో గాంధీ చిత్రపటాలతో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో "వీబీ-జీ-రామ్ జీ" 2025 అనే నూతన బిల్లును కేంద్రప్రభుత్వం తీసుకవచ్చింది. అయితే మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006 ఫిబ్రవరి 2న అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామంలో దారిద్ర రేఖ దిగువ గల ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా 100 రోజుల పని ఇచ్చేలా చట్టం చేయబడింది. 2009లో ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు జోడించబడింది.
ప్రస్తుతం ఈ పథకం స్థానంలో కేంద్రం 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్' వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పాటు పనిని కల్పిస్తుంది. అయితే ఈ పథకంలో మహత్మాగాంధీ పేరును తొలగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. గాంధీ పేరును తొలగించడం అంటే ఆయనను అవమానపరచడమేనని ఆందోళన చేస్తున్నాయి.


