
లిస్బన్: ఐరోపా కూటమిలోని దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ల్లోని అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగి మొత్తం 30 మంది సజీవ దహనమయ్యారు. పోర్చుగల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 27 మంది మరణించారు. 20 చోట్ల కార్చిచ్చు ఇంకా విజృంభిస్తుండటంతో అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా సోమవారం ప్రకటించారు. 4 వేల మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులే పోర్చుగల్లో మంటలు ఇంతలా ఎగసిపడటానికి కారణమనీ, ఆదివారం మొత్తంగా 520 చోట్ల అడవుల్లో నిప్పు రాజుకుందని అధికారులు తెలిపారు. ‘మాకు నరకం చాలా దగ్గరగా కనిపించింది. ఎక్కడ చూసినా భయంకరంగా మంటలు ఎగసిపడుతున్నాయి’ అని పెనకోవ పట్టణానికి చెందిన ఓ మహిళ వాపోయారు. ఆమె ఇద్దరు సోదరులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాతపడ్డారు.