అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త విశ్వాసంతో కనిపిస్తున్నారని శ్వేత సౌధ మీడియా కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ అన్నారు.
వాషింగ్టన్: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త విశ్వాసంతో కనిపిస్తున్నారని శ్వేత సౌధ మీడియా కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ అన్నారు. మొత్తం 90 నిమిషాలపాటు ట్రంప్తో ఒబామా భేటీ అయ్యారని చెప్పారు. ఈ సమావేశంలో వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని, ట్రంప్ ఆలోచనలు ఒబామాకు వివరించిన తర్వాత ఇక నిశ్చింతగా, ఎలాంటి కంగారు లేకుండా ట్రంప్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చనే అభిప్రాయానికి ఒబామా వచ్చారని తెలిపారు.
ఈ సమావేశంలో పొరుగు దేశాలతో వ్యవహరించాల్సిన తీరు తెన్నులు, కొన్ని దేశాలతో ఉన్న విభేదాలు, ఒప్పందాలు తదితర అంశాలు ట్రంప్కు వివరించారన్నారు. త్వరలో గ్రీస్, జర్మనీ, పెరూలో జరగనున్న అపెక్ సమావేశాల్లో అనుసరించాల్సిన విదేశాంగ విధానం గురించి కూడా ట్రంప్ తో చర్చించినట్లు తెలిపారు. దీంతోపాటు వైట్ హౌస్ లో జరిగే కార్యకలాపాల గురించి కూడా ట్రంప్కు ఒబామా క్షుణ్ణంగా వివరించినట్లు వెల్లడించారు.