
యాంగాన్: ఆరునెలలుగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చిక్కుముడిగా ఉన్న రోహింగ్యా ముస్లిం శరాణార్థుల విషయంపై ఇరుదేశాలు ముందడుగు వేశాయి. బంగ్లాదేశ్లో ఉంటున్న రోహింగ్యా శరణార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈమేరకు ఈ రెండు దేశాల మధ్య మయన్మార్ రాజధాని నేపిదాలో గురువారం ఒప్పందం కుదిరింది.
ఇందుకు సంబంధించి మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్లు మయన్మార్ కార్మిక శాఖ కార్యదర్శి మీంట్ కయాంగ్ మీడియాకు తెలిపారు. మయన్మార్లోని రఖానే రాష్ట్రంలో ఆ దేశ సైనికులు రోహింగ్యా ముస్లింలపై హింసకు పాల్పడటంతో అక్కడ్నుంచి 6,20,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు వలస వచ్చేశారు.