సల్మాన్ రష్దీని చంపితే ఇప్పుడు 28 కోట్లు | Iran imposes new 28 crore rupees on author Salman Rushdie | Sakshi
Sakshi News home page

సల్మాన్ రష్దీని చంపితే ఇప్పుడు 28 కోట్లు

Feb 25 2016 5:58 PM | Updated on Sep 3 2017 6:25 PM

సల్మాన్ రష్దీని చంపితే ఇప్పుడు 28 కోట్లు

సల్మాన్ రష్దీని చంపితే ఇప్పుడు 28 కోట్లు

ప్రముఖ ఆంగ్ల రచయిత, బ్రిటీష్ ఇండియన్ సల్మాన్ రష్దీని హత్య చేసిన వారికి ఇప్పుడు 28. 30 కోట్ల రూపాయలు లభిస్తాయి.

టెహరాన్: ప్రముఖ ఆంగ్ల రచయిత, బ్రిటీష్ ఇండియన్ సల్మాన్ రష్దీని హత్య చేసిన వారికి ఇప్పుడు 28. 30 కోట్ల రూపాయలు లభిస్తాయి. వివాదాస్పదమైన సెటానిక్ వర్సెస్ నవలను రాసినందుకు ఆయనపై 1989, ఫిబ్రవరి 14వ తేదీన ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషన్ నాయకుడు అయతొల్లా రుహొల్లా ఖొమేని ఫత్వా జారీ చేసిన విషయం తెల్సిందే. ఆయనను, ఆ పుస్తకం ప్రచురణకు కారకులైన వారందరిని హత్య చేయాల్సిందిగా ఆ ఫత్వాలో పేర్కొన్న విషయమూ తెల్సిందే. ఈ ఫత్వా ప్రకారం సల్మాన్ రష్దీని చంపేసిన వారికి 19 కోట్ల రూపాయలు ఇస్తామని ఇరాన్‌కు చెందిన ఓ మత సంస్థ 2012లో ప్రకటించింది. ఆ మొత్తం ఇప్పుడు కాస్త 24 కోట్ల రూపాయలకు చేరుకొంది.

 ఆ ఫత్వా జారీచేసి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 40 ఇరాన్ మీడియా సంస్థలు రష్దీని చంపేందుకు 4.30 కోట్ల రూపాయల విరాళాలను ఇటీవల ప్రకటించాయి. ఈ మొత్తం కలిపి 28.30 కోట్ల రూపాయలయ్యాయి. ఫత్వా జారీ చేసిన ఖొమేని చనిపోయినప్పటికీ ఆయన జారీ చేసిన ఫత్వా ఎప్పటికీ చనిపోదని ఇరాన్ అతివాదులు వాదిస్తున్నారు. ఫత్వా అమలు కోసం ప్రకటించిన రివార్డుకు విరాళాలు ప్రకటించిన మీడియా సంస్థల వివరాలను ప్రకటించిన సెమీ అఫీషియల్ ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తన వంతుగా 21.40 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. మీడియా సంస్థలన్నీ కలసి 4.30 కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించాయని ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ టెక్నాలజీ ప్రదర్శనలో  నిర్వాహకుడు మన్సోర్ అమిరి వెల్లడించారు. ఆయన సెరాజ్ సైబర్‌స్పేస్ ఆర్గనైజేషన్‌కు అధిపతిగా పనిచేస్తున్నారు.

 భారత్‌లోని ముంబయిలో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన సల్మాన్ రష్దీకి ఫత్వా జారీ అయినప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వమే ఆయనకు రక్షణ కల్పిస్తోంది. ఈ కారణంగా ఇస్లామిక్ దేశాలతో బ్రిటన్ సంబంధాలు దెబ్బతిన్నాయి.  రష్దీ రాసిన సెనాటిక్ వర్సెస్ పుస్తకాన్ని జపాన్ భాషలోకి అనువదించిన రచయిత హితోషి ఇగరాషిని ఇస్లాం తీవ్రవాదులు కత్తితో పొడిచి చంపేశారు. రష్దీ పుస్తకాన్ని ప్రచురించిన నార్వే పబ్లిషర్‌ను కాల్చి చంపారు. ఇటలీ పబ్లిషర్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ పుస్తకానికి వ్యతిరేకంగా టర్కీలో జరిగిన విధ్వంసకాండలో 37 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement