ఫారిన్ టూరిస్టులకు ఫ్రీ సిమ్ కార్డులు | India to greet foreign tourists with free local SIM card 'so they have hassle-free holidays' | Sakshi
Sakshi News home page

ఫారిన్ టూరిస్టులకు ఫ్రీ సిమ్ కార్డులు

Feb 5 2016 4:35 PM | Updated on Oct 4 2018 6:57 PM

భారతదేశంలో పర్యటించేందుకు వచ్చే విదేశీయులకు ప్రభుత్వం ఫ్రీ సిమ్ కార్డులను అందజేయనుంది. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వశాఖ త్వరలో చర్యలు తీసుకోనుంది.

భారతదేశంలో పర్యటించేందుకు వచ్చే విదేశీయులకు ప్రభుత్వం ఫ్రీ సిమ్ కార్డులను అందజేయనుంది. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వశాఖ త్వరలో చర్యలు తీసుకోనుంది. విదేశీ టూరిస్టులను ఆకర్షించడమే కాకుండా వారికి సెక్యూరిటీని కల్పించడం కూడా ఈ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. పర్యాటక, హోమ్ , టెలికం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం దీనిపై కసరత్తు మొదలుపెట్టాయి.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విదేశీ పర్యాటకులకు ఉచితంగా మంజూరు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పర్యాటకులకు ఇక్కడ లోకల్ సిమ్ కార్డులు దొరకడం కాస్త కష్టమైన విషయమే, వారి సౌకర్యార్థమే కాకుండా భద్రతా కారణాల రీత్యా కూడా ప్రభుత్వం సిమ్ కార్డులను ఉచితంగా మంజూరు చేయాలనుకోవడం ఓ మంచి ఆలోచన అని అన్నారు.

ఈ సిమ్ కార్డును ప్రభుత్వం అందజేసే టూరిస్ట్ కిట్తో పాటే పర్యాటకులకు అందించనున్నారు. సాధారణంగా టూరిస్ట్ కిట్లలో మ్యాప్లు, టూరిజం బుక్ లెట్లు, ఎమర్జెన్సీ నెంబర్లు, గమ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. వీటితోపాటే లోకల్ సిమ్ కార్డును కూడా అందించడం ద్వారా విదేశీయులు మరింత సౌకర్యవంతంగా,నిరంతరాయంగా తమ హాలిడేను కొనసాగించవచ్చని అధికారులు వెల్లడించారు.

కాగా విదేశీ పర్యాటకులకు భారత ప్రభుత్వం సులువైన పద్ధతిలో వీసాలను మంజూరును మొదలుపెట్టింది. టూరిస్ట్ వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్ లైన్లోనే అప్లై చేయవచ్చు. ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు  అప్రూవ్ అయిన తర్వాత ప్రభుత్వం పంపించే ఈ-మొయిల్ ప్రింట్ అవుట్ మీద భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు వేసే స్టాంపుతో విదేశీయులు ఇండియాలో పర్యటించగలరు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ తరహా 'ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా' పద్ధతిని 2015 ఏప్రిల్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇండియా 113 దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం కల్పిస్తుంది. మార్చి 31, 2016 వరకు 150 దేశాలకు ఈ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఇండియాలో పర్యటించే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లెక్కల ప్రకారం యూకే పౌరులు అధికంగా భారతదేశాన్ని సందర్శిస్తుండగా ఆ తరువాతి స్థానాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement