ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు! | Sakshi
Sakshi News home page

ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు!

Published Mon, Apr 27 2020 3:20 PM

German Govt Prepares Law Creating Legal Rights To Work From Home - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ కారణంగా పలు దేశాల్లోని కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసలుబాటును కల్పించిన విషయం తెల్సిందే. వైరస్‌ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక మళ్లీ ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లి పని చేయాల్సిందే. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా కోరుకున్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే హక్కు కల్పించాలని జర్మనీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందిస్తున్నామని ఆ దేశ కార్మిక మంత్రి హుబర్టస్‌ హైల్‌ మీడియాకు తెలిపారు. 
(చదవండి : అమెరికా, చైనాల తర్వాతే భారత్‌..)

జర్మనీలో కరోనా కేసులు దాదాపు ఐదు వేలకు చేరుకోవడంతో అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఐటీ సహా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసలుబాటును కల్పించాయి. ప్రస్తుతం జర్మనీలో 25 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండగా, 12 శాతం మంది ఆఫీసులకు వెళ్లి పని చేస్తున్నారు. మిగతా వారు ఏమీ లేకుండా సెలవుల్లో గడుపుతున్నారు. 

వారానికి రెండు, మూడు రోజులు లేదా శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసే వెసలుబాటును ఉద్యోగులందరికి కల్పించే బిల్లును ఈ ఏడాదే పార్లమెంట్‌కు సమర్పిస్తానని కార్మిక మంత్రి హుబర్టస్‌ తెలిపారు. దానికి దేశ ఆర్థిక మంత్రి ఓలాఫ్‌ స్కోల్జా మద్దతు తెలిపారు. అయితే కంపెనీ యజమాని అనుమతించినప్పుడే ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే హక్కు లభిస్తుందంటూ కార్మిక మంత్రి ఓ మెలిక పెట్టారు. 

Advertisement
Advertisement